యూపీలోని నోయిడా కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. కార్మికులు కోరుకున్నది కేవలం 20వేల వేతనం.. వారిది దురాశ కాదు.. హక్కు అని రాహుల్ అన్నారు. కార్మికులు సంపాదించింది సగం అద్దెలకే పోతుంది.. సంవత్సరానికి మూడు వందలు జీతం పెంచే లోపే.. వారి ఇంటి యజమాని రూ. 500 వందలు అద్దె పెంచేస్తున్నారు. కార్మికులు బతికేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూపీలోని నోయిడా కార్మికులు ఆందోళనపై సోషల్ మీడియా X ద్వారా స్పందించారు రాహుల్ గాంధీ. కార్మికులు 20వేల జీతం మాత్రమే కోరుకుంటున్నారు. అది దురాశ కాదు.. వారి హక్కు అని రాహుల్ రాశారు. నోయిడా కార్మికులు ఎన్నోమార్లు నిరసనలు తెలిపి అలసిపోయి తుది నిర్ణయంగా ఆందోళనకు దిగారని అన్నారు రాహుల్ గాంధీ. నోయిడాలో ఒక కార్మికుడు నెల రూ. 12వేలు సాంపాదిస్తుండగా.. ఇంటి అద్దె రూ. 4వేలనుంచి 7 వేల వరకు చెల్లిస్తున్నాడు. వారికి సంవత్సరాని జీతం 300 పెంచితే.. ఇంటి యజమాని అద్దెను ఏడాదికి రూ. 500 పెంచుతాడు అని రాహుల్ అన్నారు.
ఇప్పటికే అదుపులేని ద్రవ్యోల్బణం జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. ప్రజలను అప్పుల ఊబీలో ముంచేస్తోంది.. ఇదే అభివృద్ది భారత దేశం వాస్తవ పరిస్థితి అంటూ ప్రశ్నించారు. అమెరికా సుంకాల యుద్ధాలు, ప్రపంచ ద్రవ్యోల్బణం, కుప్పకూలుతున్న సరఫరా వ్యవస్థ.. ఈ భారం మోదీజీ స్నేహితులైన పారిశ్రామికవేత్తలపై పడలేదు. రోజువారీ కూలీపైనే అత్యంత తీవ్రమైన దెబ్బ పడింది. ఏ యుద్ధంలోనూ భాగం కాని, ఏ విధానాన్నీ రూపొందించని కేవలం పనిచేసిన కార్మికుడిపైనే భారం పడుతోంది. శాంతియుతంగా తమ హక్కులను డిమాండ్ చేసినందుకు ప్రతిఫలంగా వారిని అణచివేస్తున్నారని రాహుల్ అన్నారు.
ఎటువంటి సంప్రదింపులు లేకుండా తొందరపాటుతో, మోదీ ప్రభుత్వం 4 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇవి పని గంటలను 12 గంటలకు పెంచుతున్నాయి. తమ పిల్లల స్కూల్ ఫీజుల కోసం అప్పులు చేస్తూ, రోజుకు 12 గంటలూ నిలబడే ఆ కార్మికుడి డిమాండ్ అసంబద్ధమైనదా? మరి ప్రతిరోజూ వారి హక్కులను కాలరాస్తున్నది – ఇదేనా అభివృద్ది అంటే అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కార్మికులు చేపట్టిన భారీ నిరసనతో హింస చెలరేగింది. తక్కువ వేతనాలు, పెంచిన పని వేళలకు నిరసనగా 40వేల మందికి పైగా ఫ్యాక్టరీ కార్మికులు ఈ వారం ప్రారంభం నుంచి నోయిడా నగరంలోని దాదాపు 80 ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. చాలా చోట్ల రాళ్ల దాడి, ట్రాఫిక్ అంతరాయం, భద్రతా సిబ్బందిపై దాడులు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. భారీ ఎత్తున ఆందోళకారులను అరెస్టులు చేశారు పోలీసులు.

