గ్రూప్​1 నోటిఫికేషన్​కు మరో వారం టైం

గ్రూప్​1 నోటిఫికేషన్​కు మరో వారం టైం

హైదరాబాద్, వెలుగు: ఉగాది పండుగ కల్లా టీఎస్​పీఎస్సీ గ్రూప్​ 1 నోటిఫికేషన్ ను విడుదల చేస్తుందని అందరూ అనుకున్నా.. మరో వారంపది రోజుల టైమ్ పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. గ్రూప్ 1 పోస్టులపై ఇంకా 3 డిపార్ట్​మెంట్ల నుంచి వివరాలు అందలేదని తెలిసింది. దీనికితోడు నోటిఫికేషన్లు వచ్చాక లీగల్ సమస్యలకు చాన్స్ ఇవ్వొద్దన్న ఆలోచనతో టీఎస్​పీఎస్సీ జాగ్రత్తగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 19 డిపార్ట్​మెంట్లలో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ ​సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులకు ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ కూడా ఆమోదం తెలిపింది. దీంతో టీఎస్​పీఎస్సీ అధికారులు ఆయా శాఖల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్థన్​రెడ్డి నిత్యం ఆయా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లతో సమావేశాలు పెడుతూ  వివరాల సేకరణను స్పీడప్​ చేశారు. అయితే ఇప్పటికీ 16 రకాల పోస్టుల రిజర్వేషన్లు, రోస్టర్ వివరాలు అందాయని, మరో 3 డిపార్ట్​మెంట్ల వివరాలు రావాల్సి ఉందని తెలిసింది. పోస్టులు, రిజర్వేషన్ల వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా, ఒకటికి రెండు సార్లు రీచెక్ చేస్తున్నారు. అందుకే గ్రూప్​1 నోటిఫికేషన్ కాస్త ఆలస్యం కావొచ్చని అధికారులు చెప్తున్నారు. కనీసం వారం, పది రోజులైనా టైమ్ పడ్తుందని అంటున్నారు.

ఓటీఆర్​ అప్​డేట్ చేసుకోండి

టీఎస్పీఎస్సీ ఓటీఆర్ అప్​డేట్​కు అభ్యర్థులు ఆసక్తి చూపట్లేదు. 5 రోజుల్లో 20వేల మంది సవరణలు,  6 వేల మంది కొత్తగా క్రియేట్ చేసుకున్నారు. ఒకేసారి అందరూ అప్​డేట్ చేసుకుంటే సర్వర్ సమస్యలు తలెత్తుతాయి. ఓటీఆర్​ అప్​డేట్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనితారాంచంద్రన్ కోరుతున్నారు.