వికారాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈవీఎంలను సిద్ధం చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ తహశీల్దార్ ఆఫీసులో ఓటరు తుది జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ఈవీఎంల మొదటిస్థాయి పరిశీలన చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 9,84,068 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 4,86,109 మంది పురుషులు, 4,97,920 మంది మహిళా ఓటర్లతో పాటు 37 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించిన విధంగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ తోడ్పాటును అందించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, అధికారులు పాల్గొన్నారు.