
హైదరాబాద్, వెలుగు: కరోనా టైమ్లో రాష్ట్రంలో ప్రైవేట్ అంబులెన్స్ల దోపిడీ పెరిగిపోతోంది. సర్కారు అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో అందినకాడికి దోచుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా పైసలు వసూలు చేస్తున్నారు. కిలోమీటర్కు రూ. 50 నుంచి రూ. 100 వరకు తీకుంటున్నారు.
సర్కార్ అంబులెన్స్లు లేక..
రాష్ట్రంలో రోజూ 1,800కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన పేషెంట్లు అంబులెన్స్లో హాస్పిటల్కు వెళ్లాలి. కానీ రాష్ట్రంలో 350 సర్కారు (108) అంబులెన్స్లే ఉన్నాయి. ఇందులో 90 బండ్లు కరోనాకు, మిగతావి వేరే అవసరాలకు వాడుతున్నారు. దీంతో వందల మందిని హాస్పిటల్స్కు తీసుకెళ్లడం సాధ్యం కావట్లేదు. పాజిటివ్ వస్తే అధికారులు కాల్ చేసి ‘అంబులెన్స్ పంపించడం సాధ్యం కావడం లేదు. మీరే ఎలాగోలా వచ్చేయండి’ అంటున్నారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్లకు డిమాండ్ పెరిగింది. హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయిన వాళ్లకు, వేరే జబ్బుల మీద ఇతర దవాఖాన్లకు రిఫర్ చేసిన వాళ్లకూ అంబులెన్స్ తిప్పలు తప్పడం లేదు. చాలా జిల్లాల్లోనూ అంబులెన్స్లు సరిగా లేవు. ఉన్న వాటిలో ఎక్కువ శాతం ఈమధ్య హైదరాబాద్కు తరలించారు.
అడిగినంత ఇచ్చుడే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ అంబులెన్స్లకు డిమాండ్ పెరగడంతో అడిగినకాడిని ముట్టజెప్పాల్సి వస్తోంది. గతంలో 10 నుంచి 20 కిలోమీటర్లకు రూ. 5 వేలు తీసుకునేవాళ్లు ఇప్పుడు రూ. 10 వేల దాకా తీసుకుంటున్నారు. కరోనాకు ముందు కిలోమీటర్కు రూ. 30 నుంచి రూ. 35 తీసుకోగా ప్రస్తుతం రూ. 50 నుంచి రూ. 100 మధ్య అడుగుతున్నారు. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అంబులెన్స్లలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్), బేసిక్ లైఫ్ సపోర్ట్ (బీఎల్ఎస్) అని ఉంటాయి. ఏఎల్ఎస్ చార్జీలు ఎక్కువుంటాయి.
అసలేం పనికిరావు
‘రాష్ట్రంలోని 80 నుంచి 90 శాతం ప్రైవేట్ అంబులెన్స్లు పేషెంట్లను తరలించడానికి పనికి రావు. ఏ టైం ఎంత ఆక్సిజన్ పెట్టాలో కూడా స్టాఫ్కు తెల్వదు’ అని 108 ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పల్లె అశోక్ అన్నారు. రూల్స్ ప్రకారం అంబులెన్స్లో అత్యవసర సమయంలో ట్రీట్మెంట్ అందించడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆక్సిజన్ సిలిండర్, మెడికల్ ఎక్విప్మెంట్, ట్రైన్డ్ స్టాఫ్ ఉండాలి. కానీ రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ అంబులెన్స్లలో ఇవేవీ కనిపించవని పలువురు అంటున్నారు. వెహికల్స్ కూడా సరిగా ఉండవని చెబుతున్నారు. ఇన్సూరెన్స్, పొల్యూషన్ చెక్, ఎఫ్సీ క్లియరెన్స్ ఉండాలి. ఇవేవీ లేకున్నా ఆర్టీఏ ఆఫీసుల్లో ఫిటెనెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆరోపణలున్నాయి.