ల్యాండ్​పూలింగ్​కు భూములు ఇచ్చేది లేదు

ల్యాండ్​పూలింగ్​కు భూములు ఇచ్చేది లేదు

వరంగల్‍, కాశిబుగ్గ : కుడా ఆధ్వర్యంలో వరంగల్‍, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఉన్న 21,517 ఎకరాల భూముల్లో ల్యాండ్‍పూలింగ్‍ కోసం అధికారులు సర్వే చేపట్టే క్రమంలో రైతులు సోమవారం ఆందోళన బాట పట్టారు. ఉదయం పైడిపల్లి, ఆరేపల్లి, కొత్తపేటకు చెందిన రైతులు పెద్ద ఎత్తున జీడబ్ల్యూఎంసీకి చేరుకున్నారు. అక్కడ గ్రీవెన్స్​సెల్​ముందు ఆందోళన చేశారు. ఆపై సెక్యూరిటీని దాటి కమిషనర్‍ ప్రావిణ్య దగ్గరకు వెళ్లారు. ఆమె 'కుడా' వైస్​చైర్మన్​గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. 'రైతులకు ఇష్టం ఉంటేనే భూములు తీసుకుంటాం' అంటూనే తమ ప్రమేయం లేకుండా సర్వేలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. తర్వాత అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. వరంగల్‍, గీసుగొండ, స్టేషన్‍ఘన్‍పూర్‍, ఐనవోలు మండలాల పరిధిలోని  స్తంభంపల్లి, బొల్లికుంట, గాడిపెల్లి, ధర్మారం, కొత్తపేట, వసంతాపూర్‍, కూనూరు, వెంకటపూర్‍, నష్కల్‍ గ్రామాల రైతులు 'కుడా' ఆఫీస్​ముందు ధర్నా చేశారు. సిటీ డెవలప్‍మెంట్‍ పేరుతో తమ భూముల జోలికొస్తే చావుకు భయపడకుండా ఆందోళనలకు దిగుతామన్నారు. తర్వాత పెద్ద సంఖ్యలో వరంగల్​కలెక్టరేట్​కు చేరుకున్నారు. తమ సమస్యను చెప్పుకుందామంటే కలెక్టర్​స్పందించడం లేదని, కలెక్టర్‍ బయటకు రావాలంటూ ఆందోళనకు దిగారు. అదాలత్​మెయిన్​రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్పందించిన కలెక్టర్​రైతులు ఇచ్చిన రిపోర్ట్​ను ప్రభుత్వానికి పంపించనున్నట్టు చెప్పారు.

పత్తి మిల్లు ఓనర్‍ సూసైడ్​ అటెంప్ట్

వరంగల్‍ : పత్తి మిల్లు నడవాలంటే అధికారులు లంచం డిమాండ్‍ చేస్తున్నారని.. గతంలో గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేసిన లాభం లేదంటూ మిల్లు ఓనర్‍ సూసైడ్​అటెంప్ట్​చేశాడు. బాధితుడు రఘురాం కథనం ప్రకారం..వరంగల్‍కు చెందిన తాము పత్తి మిల్లు లీజ్‍ తీసుకుని టెండర్‍ వేస్తే.. అక్టోబర్‍ 2 అందరికి పర్మిషన్​ఇచ్చారని, తనకు మాత్రం ఇవ్వలేదన్నారు. కాటన్‍ సెక్షన్‍ ప్రెసిడెంట్‍, సెక్రెటరీలకు లంచం ఇవ్వకపోవడంతో తమ మిల్లుకు పత్తి పంపలేదన్నారు. 2019–20లో ఒక్క లాట్‍కు (100 బేళ్లు)  రూ.45 వేల చొప్పున  రూ.25 లక్షలు ఇచ్చామన్నారు.  2020–21లో  ఒక్కో లాట్‍కు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‍ చేశారని, లేదంటే పత్తి దిగదంటూ బ్లాక్‍ మెయిల్‍ చేసినట్లు చెప్పారు.  దీనిపై 15 రోజుల క్రితం గ్రీవెన్స్​లో కలెక్టర్‍ను కలిసి కంప్లయింట్​చేశామని, సీసీఏ మేనేజర్‍ను కలిస్తే సదరు వ్యక్తులపై విజిలెన్స్​ఎంక్వైరీ చేయిస్తామని చెప్పినట్లు వివరించారు. సెక్షన్‍ ప్రెసిడెంట్‍, సెక్రెటరీల నుంచి తాము గతంలో ఇచ్చిన డబ్బులు ఇప్పించి మిల్లుకు పత్తి వచ్చేలా చూడాలన్నారు.  

నిజామాబాద్​లో యువతి ఆత్మహత్యాయత్నం  

నిజామాబాద్ : తమ సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్​కలెక్టరేట్ లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. నిజామాబాద్​కు చెందిన నాగలక్ష్మి ఓ ప్రైవేట్​ఆఫీసులో స్వీపర్​గా పని చేస్తోంది. అయితే ఆఫీసులో తన వీడియోను తీసిన ఇద్దరు వ్యక్తులు దాన్ని మిక్సింగ్​చేసి తాను మంత్రగత్తెనంటూ సోషల్​మీడియాలో షేర్​చేశారని వాపోయింది. ఇందులో నాందేవ్ అనే వ్యక్తి ప్రధాన కారణమని ఆరోపించింది. తన వెంట తెచ్చుకున్న బాత్​రూం క్లీనర్​తాగింది. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్​కి తరలించారు. ఆమె దగ్గర నోట్​స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు, పెద్ద మనుషులు మోసం చేశారని.. 

నల్గొండ: ‘నా బిడ్డను ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తిపై డిండిలో కేసు పెట్టినం. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తే అక్కడి స్టేషన్​కే పంపించిన్రు. రిమాండ్ చేసే క్రమంలో పెద్దమనుషులు వచ్చి కేసు వద్దని, పెళ్లి చేస్తామని పేపర్​ రాసి ఇచ్చిన్రు. ఈ నెలలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంటే ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడని వాళ్ల బంధువులే వచ్చి ఫిర్యాదు చేసిన్రు. పోలీసులు, పెద్ద మనుషులు కలిసి మమ్ముల మోసం చేస్తున్నరు. ఫిర్యాదు చేయడానికి మరోసారి ఎస్పీ దగ్గరికి వచ్చినం’ అంటూ నల్గొండ జిల్లా ఎస్పీ ఆఫీసు గ్రీవెన్స్​ సెల్ ​వద్ద డిండి మండలం ఎర్రారానికి చెందని సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక పీఎస్​లో న్యాయం జరగడం లేదని.. తిప్పించుకుంటున్నారని వాపోయారు. 

భూకబ్జాకు యత్నిస్తున్నారని...

నిజామాబాద్ : జక్రాన్​ పల్లి మండలం ఆర్గుల్​గ్రామానికి  చెందిన మేకల చిన్న చెన్నయ్య తన భూమిని కొంతమంది రాజకీయ నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆత్మహత్య చేసుకునేందుకు డీజిల్ బాటిల్​తో కలెక్టరేట్​లోకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తన పేరుమీద పట్టా ఉన్నప్పటికీ 3 ఎకరాల భూమిని డాక్టర్​మధుశేఖర్​, పెద్దోళ్ల గంగారెడ్డి అనే పొలిటికల్​లీడర్స్​ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కలెక్టరేట్​ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నా పోలీసు కేసు నమోదు చేయడం లేదని వాపోయాడు. న్యాయం జరుగుతుందని ఆశ లేకపోవడంతోనే ఆత్మహత్యకు యత్నించానని కలెక్టర్​ కు చెప్పాడు. 

కలెక్టర్​ ఆఫీసుల్లో గ్రీవెన్స్​కు సమస్యలు చెప్పుకుందామని వస్తున్న బాధితులు, ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం కాకపోవడంతో విసుగెత్తిపోతున్నారు. ఒపిక నశించిన కొందరు ఆత్మహత్య చేసుకొని చస్తామని బెదిరిస్తున్నారు. సోమవారం పలు జిల్లాల్లో ఈ తరహా ఆందోళనలు, ఆత్మహత్యాయత్నాలు కలకలం రేపాయి. తాము సర్కారు ల్యాండ్​పూలింగ్​కు భూములు ఇచ్చేది లేదంటూ వరంగల్​ రైతులు అధికారుల ఎదుటే ఆందోళన చేశారు. నిజామాబాద్​లో ఓ యువతి తనను మంత్రగత్తె అంటూ సోషల్​మీడియాలో ప్రచారం చేస్తున్నారని బాత్​రూం క్లీనర్​తాగింది. ఇక్కడే మరొక వ్యక్తి తన భూమిని రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారని డీజిల్ బాటిల్ ​పట్టుకుని కలెక్టరేట్​లోకి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వరంగల్​లో పత్తి మిల్లు నడవాలంటే అధికారులు లంచం డిమాండ్‍ చేస్తున్నారని.. గతంలో గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేసిన లాభం లేదంటూ మిల్లు ఓనర్‍ ఒంటి మీద పెట్రోల్​ పోసుకొని కలకలం రేపాడు.