
- మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట నారాయణపురం రైతుల ఆందోళన
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు: భూ ప్రక్షాళనలో భాగంగా రద్దు చేసిన పట్టాలని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట బాధిత రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న1,827 ఎకరాల పట్టా భూములను 2017లో ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములుగా పేర్కొంటూ, పట్టాలు రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 94 జారీ చేసి రైతు, తండ్రి పేరు వచ్చే చోట అడవి అనే పదం తొలగించారని తెలిపారు. కానీ, గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఆరు నెలలు గడిచినా, పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయలేదని వాపోయారు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో పంట రుణాలు, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, ఇతర ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భూభారతి చట్టం కింద తమ సమస్య పరిష్కరించాలని కోరారు.