ఉప్పల్, వెలుగు: మల్లాపూర్ మెయిన్ రోడ్లోని ఓ వైన్స్లో మంటలు చెలరేగి సుమారుకోటిన్నర విలువైన లిక్కర్ బాటిళ్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలను నాచారం పోలీసులు వెల్లడించారు. రవి కిశోర్ గౌడ్ అనే వ్యక్తి మల్లాపూర్ మెయిన్ రోడ్లో ‘స్వర్ణ వైన్స్’ను నిర్వహిస్తున్నాడు.
రోజూ వైన్స్ క్లోజ్ కాగానే అందులో పనిచేసే సిబ్బంది అదే బిల్డింగ్పై నిద్రపోతారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు బిల్డింగ్ కింది పోర్షన్లోని వైన్స్లో మంటలు ఎగిసిపడటం చూసిన కొందరు వెంటనే సిబ్బందికి చెప్పారు. వారంతా కిందకు దిగేలోపే లిక్కర్ బాటిల్స్, వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.
సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.మొత్తం కోటిన్నర విలువైన లిక్కర్ బాటిళ్లు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు రవికిశోర్ గౌడ్ పోలీసు లకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.