వైన్స్​లో అగ్ని ప్రమాదం..  రూ.కోటిన్నర విలువైన లిక్కర్ బాటిల్స్, సామగ్రి దగ్ధం

వైన్స్​లో అగ్ని ప్రమాదం..   రూ.కోటిన్నర విలువైన లిక్కర్ బాటిల్స్, సామగ్రి దగ్ధం

ఉప్పల్, వెలుగు: మల్లాపూర్ మెయిన్ రోడ్​లోని  ఓ వైన్స్​లో మంటలు చెలరేగి సుమారుకోటిన్నర విలువైన లిక్కర్ బాటిళ్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. ఘటనకు సంబంధించిన  వివరాలను నాచారం పోలీసులు వెల్లడించారు. రవి కిశోర్ గౌడ్ అనే వ్యక్తి  మల్లాపూర్ మెయిన్ రోడ్​లో ‘స్వర్ణ వైన్స్’ను నిర్వహిస్తున్నాడు.

 రోజూ వైన్స్ క్లోజ్ కాగానే అందులో పనిచేసే సిబ్బంది అదే బిల్డింగ్​పై నిద్రపోతారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు బిల్డింగ్ కింది పోర్షన్​లోని వైన్స్​లో  మంటలు ఎగిసిపడటం చూసిన కొందరు వెంటనే  సిబ్బందికి  చెప్పారు. వారంతా కిందకు దిగేలోపే లిక్కర్ బాటిల్స్, వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది  మంటలను ఆర్పివేశారు.మొత్తం కోటిన్నర విలువైన లిక్కర్ బాటిళ్లు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు రవికిశోర్ ​గౌడ్ ​పోలీసు లకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  షార్ట్​సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.