ఫస్టియర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మళ్లీ పెట్టాలి
గాంధీ మెడికల్ కాలేజీ వద్ద ఎంబీబీఎస్ స్టూడెంట్ల ధర్నా
పద్మారావునగర్, వెలుగు: కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ పరిధిలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్లకు ఇటీవల నిర్వహించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం జరగలేదని స్టూడెంట్లు ఆరోపించారు. ఎగ్జామ్స్ మళ్లీ పెట్టాలని డిమాండ్ చేస్తూ పలు మెడికల్ కాలేజీ లకు చెందిన ఫస్టియర్ స్టూడెంట్లు మంగళవారం సాయంత్రం గాంధీ మెడికల్ కాలేజీ వద్ద ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎగ్జామ్ పేపర్ సరైన ప్యాట్రన్లో లేదని, అసంబద్ధ ప్రశ్నలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 530 మంది స్టూడెంట్లు(10శాతం) ఫెయిల్ అయ్యారన్నారు. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం బ్యాక్లాగ్ రాసుకునే అవకాశం లేదని, తాము ఏడాది నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై యూనివర్సిటీ వీసీను కలవడానికి ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు.
హెల్త్ మినిస్టర్ను కలిశామని, సెప్టెంబర్లో తిరిగి ఎగ్జామ్పెడతామని చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, రీ కరెక్షన్ లేదా రీ ఎగ్జామ్ నిర్వహించాలని కోరారు.

