జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రూ.13 వేల కోట్లతో చేపట్టారు. ఇప్పటికి రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. పనులు ఇంకా పూర్తి కాలేదు.. అయినా ఈ వానాకాలం మోటార్ల సహాయంతో ఇప్పటివరకు 6 టీఎంసీల గోదావరి నీళ్లను ఎత్తిపోసి 350 చెరువులను నింపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 60 టీఎంసీల నీళ్లు వినియోగంలోకి వస్తాయి. 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది.
ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ఇంటెక్వెల్ నుంచి ఏడాదికి 60 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోయడం దేవాదుల ప్రాజెక్ట్ లక్ష్యం. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా రూ. 6,016 కోట్ల అంచనా వ్యయంతో 2004లో ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టారు. మూడు దశల్లో పనులు చేపట్టారు. ఇప్పటికి అంచనా వ్యయం రూ.13,445 కోట్లకు పెరిగింది. పూర్తయిన పనులపై ఇప్పటికే రూ.9 వేల కోట్ల వరకు చెల్లింపులు చేశారు. 2018‒19లో 2,90,643 ఎకరాలు, 2019‒20లో 1,10,288 కొత్త ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా నెరవేరలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనుల వల్ల సాగవుతున్న వ్యవసాయ భూములు మినహా గడిచిన ఐదేళ్లలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా సాగు నీరందించలేకపోయారు. దేవాదులను కూడా రీ డిజైన్చేసి కొన్ని కొత్త ప్రాజెక్ట్లను ఇందులో కలిపారు తప్ప పెండింగ్ పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు.
పూర్తికాని కాలువలు
దేవాదుల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా, 64 వేల ఎకరాలకు చెరువుల కింద సాగు నీరందించాలి. ఇప్పటివరకు కేవలం 1.56 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే స్థిరీకరించారు. మొదటి, రెండో, మూడో దశలలో కలిపి 17 రిజర్వాయర్లను నిర్మించాలి. ధర్మసాగర్, నర్సింగపూర్, ఆర్ఎస్ ఘన్పూర్, ఆశ్వరావుపల్లి, చిటకోడూరు, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్పల్లి, నష్కల్, పాలకుర్తి, చెన్నూర్, నవాబ్పేట, లద్నూర్, కన్నెబోయినగూడెం, మాసిరెడ్డి చెరువు, ఐనాపూర్లను రిజర్వాయర్లుగా మార్చి కాలువల ద్వారా పంట పొలాలకు సాగు నీరందించాలి. ఇప్పటికి ఇంకా 4.7 లక్షల ఎకరాల పంట పొలాలకు సాగునీరందించడానికి కాలువల నిర్మాణం పూర్తి కాలేదు.
మొదటి, రెండో దశ పైప్లైన్లతో నీటి పంపింగ్
దేవాదుల ప్రాజెక్ట్ లో మొదటి, రెండోదశ పైప్లైన్ నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. 2014కు పూర్వం నుంచే నీటి పంపింగ్స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది కూడా ఈ రెండు పైప్లైన్ల ద్వారానే గోదావరి నీళ్లు తపాస్పల్లి వరకు చేరుతున్నాయి. 150 కి.మీ. పొడవునా ఉన్న సుమారు 350కి పైగా చెరువులను నింపుతున్నారు. ధర్మసాగర్, ఆర్ఎస్ ఘన్పూర్ తదితర రిజర్వాయర్ల కింద 60 వేల ఎకరాలకు పైగా సాగు నీరందిస్తున్నారు. ఈ పథకంలో అతి ప్రధానమైన మూడో దశ పనులు పూర్తి చేస్తే ఏడాదికి 40 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని ఎగువకు పంపింగ్ చేయవచ్చు. మూడోదశలోని మొదటి ప్యాకేజీ కింద ఇంటెక్వెల్ నుంచి భీంఘన్పూర్ వరకు మూడు వరసల పైప్లైన్ నిర్మాణం పూర్తయ్యింది. ఇంటెక్వెల్ వద్ద 6 పంపులను కూడా బిగించారు. రెండో ప్యాకేజీ కింద భీంఘన్పూర్నుంచి రామప్ప వరకు చేపట్టిన మూడు వరసల పైప్లైన్ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. మూడో ప్యాకేజీ కింద రామప్ప నుంచి ధర్మసాగర్వరకు రూ.1,494 కోట్లతో చేపట్టిన సొరంగ నిర్మాణ పనులు సుమారు ఏడేళ్లకు పైగా నిలిచిపోయాయి. ఇటీవల కాంట్రాక్ట్ సంస్థను మార్చి కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించి మళ్లీ పనులు మొదలుపెట్టారు. మిగతా ఐదు ప్యాకేజీల పనులు సమాంతరంగా జరిపితే వచ్చే ఖరీఫ్లోగా పనులు పూర్తయ్యే అవకాశం కన్పిస్తోంది.
దేవాదుల పూర్తయితే..
దేవాదుల ప్రాజెక్ట్పై రాష్ట్ర ప్రభుత్వం రూ.100 ఖర్చు చేస్తే అందులో రూ.25 చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండడంతో పనులు ముక్కుతూ ములుగుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ పథకంపై రూ.5 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తే మరో 5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్తో పాటుగా దేవాదుల ఎత్తిపోతల పథకానికి కూడా సమాంతరంగా నిధులు విడుదల చేస్తే గడిచిన 5 ఏళ్లలో పనులు పూర్తయ్యి 6 లక్షల ఎకరాలకు సాగు నీరందేది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9781 కోట్లను ఖర్చచేసింది. మొదటి దశలో రూ.1232 కోట్లు, రెండో దశలో రూ.2460 కోట్లు, మూడో దశలో రూ.4108 కోట్లు కలిపి మొత్తం ఇంజినీరింగ్పనుల కోసం రూ.7,800 కోట్లు ఖర్చుచేశారు. అలాగే అటవీ భూముల సేకరణకు రూ.33.91 కోట్లు, పంట పొలాల భూసేకరణకు రూ.728.77 కోట్లు, హెచ్టీసీసీ ఛార్జెస్ కింద రూ.697.36 కోట్లు, నాన్ఈపీసీ వర్క్ల కోసం రూ.57.65 కోట్లు, ఇతర వర్క్ల కోసం రూ.431.19 కోట్లు, ఇతర ఖర్చుల కింద 32.5 కోట్లు కలిపి మొత్తంగా ఈ స్కీం కింద రూ.9,781 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో ఏఐబీపీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా రూ.972 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చాయి.