
- పెండ్లిళ్లు లేవు..పూజలు లేవు
- కొనేవారు లేక లక్షల్లో నష్టపోతున్న రైతులు
ప్రతి సంవత్సరం ఎండాకాలం రాగానే పెండ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఉగాది, శ్రీరామ నవమి వంటి ప్రధాన పండుగలు కూడా ఈ సీజన్లో వచ్చేవే. పూల రైతులు నాలుగు రూపాయలు సంపాదించుకునేది కూడా ఇప్పుడే..కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది సంపాదన మాట అటుంచితే… తీవ్ర నష్టాలు తప్పేలాలేవు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉండడంతో ఇప్పటికే గుడులు మూతపడ్డాయి. పెండ్లిళ్లకు బ్రేక్ పడింది. పండుగలూ సాదాసీదాగానే జరుగుతున్నాయి. దీంతో పూలన్నీ చేన్లలోనే ఉంటున్నాయి. కూరగాయలు,పండ్లు, మాంసం మార్కె ట్లకు షరతుల మీద అనుమతిచ్చిన సర్కారు పూల మార్కె ట్లను మాత్రం పూర్తిగా బంద్ చేయించింది. ఇండ్లలో పూజలు, అక్కడక్కడ చావుల కోసమైనా చిన్నచితక దుకాణాల్లో అమ్ముకుందామన్నా తెంపేందుకు కూలీలు రావడం లేదు.
వివిధ రకాల పూలు
రాష్ట్రంలో దాదాపు 10 వేల ఎకరాల్లో బంతి, చామంతి, కనకాంబరం, గులాబీ, లిల్లీ,మల్లె,జర్మనీ, ఆస్టల్ తదితర పూలు సాగు చేస్తున్నారు. 1000 ఎకరాల వరకు పాలీహౌజ్లు ఏర్పాటు చేసుకొని జర్బరా పూలు కూడా వేస్తున్నారు. ఒక్క పాలీ హౌస్ వేయాలంటే రూ. 14 లక్షల వరకు ఖర్చవుతుంది.ఇందులో హార్టీ కల్చర్ శాఖ75 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఒక్కసారి పంట వేస్తే ఆరు నెలల్లో సాగు మొదలై మూడేళ్లవరకు పూలు వస్తాయి. కానీ వారానికి రెండుసార్లు మందు పిచికారీ చేయాల్సి ఉంటుంది. డ్రిప్ ద్వారా నీళ్లు, పైన నీడ తప్పనిసరి. ఉద్యాన పంటలన్నీ ఆరుతడి పంటలే.. అయితే కూరగాయల సాగుకన్నా కాస్త పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. వీటికి పెండ్లిళ్లు, పండుగల సీజన్లో డిమాండ్ బాగా ఉంటుంది. గృహప్రవేశాలు,జాతరలు, సభలు, చావులకు కూడా కామన్గా వాడుతుంటారు.
గిరాకీ లేదు
కరోనా ప్రభావంతో పెండ్లిళ్లు, ఫంక్షన్ లు నిలిచిపోవడం, గుడులు మూతపడటం, ఉగాది, శ్రీరామనవమి వేడుకలు నిర్వహించకపోవడంతో పువ్వులకు గిరాకీ లేకుండా పోయింది. కనీసం హైదరాబాద్ మార్కె ట్ కు తీసుకెళ్లి అమ్ముకుం దామనుకున్నా లాక్ డౌన్ తో వెహికిల్స్ తిరగక పోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. పువ్వులు తెంపకపోవడంతో చెట్లమీదనే వాడుతున్నాయని రైతులు వాపోతున్నారు.