ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుక..​ హోటల్​కు లక్ష ఫైన్​

ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుక..​ హోటల్​కు లక్ష ఫైన్​

హైదరాబాద్, వెలుగునగరంలోని ప్రముఖ హోటళ్లపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపించింది. సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్, సరూర్ నగర్ బైరామల్ గూడ కేఫ్ బహర్ కు వేర్వేరుగా లక్ష రూపాయల ఫైన్ విధించారు. ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయనీ ఓ కస్టమర్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయగా, స్థానిక హెల్త్ ఆఫీసర్, ఫుడ్ ఇన్ స్పెక్టర్, శానిటరీ అధికారి హోటల్ కు చేరుకున్నారు. కిచెన్ ను సందర్శించి అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇందుకుగాను లక్ష రూపాయల జరిమానా విధించి నోటీసు ఇచ్చారు.

కుళ్లిన కూరగాయలతో వంటకం

ప్యారడైజ్ హోటల్ ఫుడ్ ప్రిపేర్ చేసేందుకు దొడ్డుప్పు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, కుళ్లిన కూరగాయలతో ఆహారం సిద్ధం చేస్తున్నారని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్నారని లక్ష రూపాయల ఫైన్​ వేశారు.

కేఫ్​బహర్​కు లక్ష ఓయో హోటల్​కు రూ.50 వేలు

ఎల్బీ నగర్ :  సాగర్ రింగ్ రోడ్డులోని కేఫ్ బహర్ పరిశుభ్రత పాటించకపోవడంతో పాటు మిగిలిపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచి సర్వ్ చేస్తున్నారని ఫిర్యాదుతో జీ‌‌‌‌హెచ్‌‌‌‌ఎం‌‌‌‌సీ అధికారులు గురువారం లక్ష రూపాయలు, దాని పైన ఉన్న ఓయో హోటల్ పరిశుభ్రంగా లేదని రూ.50 వేల జరిమానా విధించారు. రెస్టారెంట్ వంటగది నుంచి పొగ, మసాల ఘాటుతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీ చేశారు. హోటల్, రెస్టారెంట్ లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు మరుసటి రోజు కస్టమర్లకు వడ్డించడమే కాకుండా ట్రేడ్ లైసెన్స్ లేదని డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ, ఏ‌‌‌‌ఎం‌‌‌‌హెచ్‌‌‌‌ఓ మల్లికార్జున్ గుర్తించారు. శుభ్రత పాటించకుంటే, వారం రోజుల్లో ట్రేడ్ లైసెన్స్ తీసుకోకపోతే హోటల్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

చందానగర్సర్కిల్ పరిధిలోని గంగారంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్​ గోడలకు లైటింగ్​ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు రూ.3 లక్షలు జరిమానా విధించారు.