రూ.67 లక్షల విలువైన ఫారిన్ సిగరెట్లు సీజ్

రూ.67 లక్షల విలువైన  ఫారిన్ సిగరెట్లు సీజ్

సికింద్రాబాద్, వెలుగు: అక్రమంగా రైలులో తరలిస్తున్న  ఫారిన్ సిగరెట్లను ఆర్పీఎఫ్, సౌత్ సెంట్రల్ రైల్వే క్రైమ్ ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఈ నెల 3న నాంపల్లి రైల్వే స్టేషన్​కు వచ్చిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ నుంచి పెద్ద పెద్ద పార్సిళ్లను అన్​లోడ్ చేయడాన్ని గమనించిన పోలీసులు అనుమానంతో వాటిని తనిఖీ చేశారు. 

15 పార్సిళ్లు న్యూ ఢిల్లీ నుంచి వచ్చినట్లు గుర్తించారు. వాటిని తెరిచి చూడగా.. 45 కార్టెన్ బాక్సుల్లో 4 లక్షల 50 వేల ఫారిన్ బ్రాండ్ సిగరెట్లు కనిపించాయి. ఈ పార్సిళ్లన్నీ కిరాణా వస్తువుల పేరుతో ఢిల్లీ నుంచి హైదరాబాద్​కు ఫేక్ నేమ్​తో బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ ఫారిన్ సిగరెట్ల విలువ సుమారు 67 లక్షలకుపైగా ఉండొచ్చన్నారు. పార్సిళ్లను బుక్ చేసిన వ్యక్తిపై రైల్వే యాక్ట్ కింద కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు.