సీఎం కేసీఆర్ , సీపీ అంజనీ కుమార్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నానని అన్నారు మాజీ ఎంపీ, బిజేపీ నేత వివేక్ వెంకటస్వామి. దుబ్బాక ఉప ఎన్నికలకు డబ్బులు పంపిస్తున్నాననీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడితో హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ తమ సంస్థ పై కేసు లు నమోదు చేశారని అన్నారు. ఎలాంటి విచారణ చేయకుండానే హైదరాబాద్ కమిషనర్ తమ సంస్థ పై కేసులు ఎలా నమోదు చేస్తారు అని ప్రశ్నించారు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే అంజనీకుమార్ ప్రెస్ మీట్ పెట్టి తమ సంస్థ పై ఎలా ఆరోపణలు చేస్తాడని అన్నారు.
తన మీద నిరాధారమైన, తప్పుడు క్రిమినల్ కేసు పెట్టినందుకు దావా వేశానని, వారు ఎలాంటి కండిషన్లు లేకుండా క్షమాపణ చెప్పాలన్నారు. తన మీద నిరాధార, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు పంపుతున్నానంటూ వివేక్ వెంకటస్వామి ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ అహంకార రాజ్యం నడుస్తుందని, కొంతమంది పోలీసు అధికారులను ఇష్టమొచ్చినట్లుగా ముఖ్యమంత్రి వాడుకుంటున్నాడని అన్నారు. మంచి పోస్టింగులు పొందేందుకు ముఖ్యమంత్రి కి పోలీసులు అనుకూలంగా వ్యవరిస్తున్నారని అన్నారు. నిజాం సర్కార్ మాదిరిగా కెసిఆర్ వ్యవరిస్తున్నాడని మండి పడ్డారు.