- కంపెనీకి రూ.1,122 కోట్ల లాభం
- రికార్డు డివిడెండ్ ప్రకటన
న్యూఢిల్లీ: నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ , డిస్ట్రిబ్యూషన్ సంస్థ..గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( గెయిల్ )ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లోరూ.1,122 కోట్ల లాభం సంపాదించింది. 2018 ఆర్థిక సంవత్సరం క్యూ 4 లాభంతో (రూ.1,020కోట్లు) పోలీస్తే ఇది 10 శాతం అధికం. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.6,026 కోట్ల లాభం వచ్చింది. పెట్రో కెమికల్స్, మార్కెటిం గ్ విభాగాల్లో పనితీరు బాగానే ఉండటంతో లాభాలు పెరిగాయి. అయితే పెట్టిన పెట్టుబడులపై రూ.326 కోట్ల అసాధారణ నష్టాన్ని నమోదు చేసింది. క్వార్టర్ వారీగా చూస్తే రాబడి ఐదు శాతం తగ్గి రూ.18,763 కోట్లు వచ్చింది. ఇబిటా కూడా గత క్వార్టర్ తో పోలిస్తే 37 శాతం తగ్గి రూ.1,684కోట్లు మాత్రమే వచ్చింది. ఆపరేటింగ్ మార్జిన్ 450 బేసిస్ పాయింట్లు క్షీణించి 9.5 శాతంగా నమోదయింది.
2019 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ 39 శాతం పెరిగి రూ.74,808 కోట్లకు చేరింది. మనదేశంలోనే అతిపెద్ద గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అయిన గెయిల్ , అంతర్జాతీయ మార్కెట్లో కాంట్రాక్టు ధరలకు సహజవాయువును కొని ద్రవరూపంలోకి మార్చుతుంది. తదనంతరం దేశీయ మార్కెట్లో లాభదాయక ధరలకు అమ్ముతుంది. ఫలితంగా గరిష్టంగా 75 శాతం వరకు రెవెన్యూ వస్తుంది. అయితే సింగపూర్ లిక్వి ఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ ఎన్ జీ) ధరలు బాగా తగ్గాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆరు నెలల్లో ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ ధర 60 శాతం తగ్గి 4.2 డాలర్లకు చేరింది. గ్లట్ సరఫరా విపరీతంగా ఉండటం, ఉత్తర ఆసియా వ్యాప్తంగా నిల్వలు పేరుకుపోవడమే ఇందుకు కారణం.
ఇదిలా ఉంటే గెయిల్ బోర్డు ఒక్కో షేరుకు రూ.1.77 తుది డివిడెండ్ తోపాటు ఒక బోనస్ షేరును ప్రకటించిం ది. ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేరు 1.90 శాతం పెరిగి రూ.348కి చేరింది. ప్రస్తు త సంవత్సరంలో చెల్లించిన మొత్తం డివిడెండ్ విలువ రూ.8.02లకు చేరింది. ఈ సందర్భంగా గెయిల్ సీఎండీ బీసీ త్రిపాఠీ విలేకరులతో మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో ఇళ్లకు, పరిశ్రమలకు గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడానికి రూ.54 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గెయిల్ కు ఇప్పటికే 14 వేల కిలో మీటర్ల పొడవున పైప్ లైన్ నెట్ వర్క్ ఉండగా, తూర్పు , దక్షిణ రాష్ట్రాలకు గ్యాస్ సరఫరా చేయడానికి మరో ఆరు వేల కిలో మీటర్ల పొడవున లైన్లను నిర్మిస్తోంది. ఇందుకు రూ.32 కోట్లు ఖర్చుచేస్తోంది.
మరికొన్ని ముఖ్యాంశాలు
- పెట్రో కెమికల్ వ్యాపారం ఎబిటా రూ.29 కోట్ల లాభం నుంచి రూ.20 కోట్లకు తగ్గింది.
- సీక్వెన్షియల్ గా నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ వ్యాపారం ఆదాయం 4.6 శాతం తగ్గి రూ.15,454 కోట్లు గా నమోదయింది.
- ఎల్పీజీ వ్యాపార రాబడి 25.8 శాతం తగ్గి రూ.1,211 కోట్లు గా తేలింది. దీని ఈబీఐటీ రూ.416 కోట్లకు పడిపోయింది.
- ట్రాన్స్ మిషన్ ఈబీఐటీ మార్జిన్ గత క్వార్టర్ లో 59 శాతం రాగా, ఈసారి ఇది52.80 శాతానికి పరిమితమయింది.
- నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ ఈబీఐటీ 4.2 శాతం నుంచి 3.8 శాతానికి పడిపోయింది.
- ఎల్పీబీ సెగ్మెంట్ ఈబీఐటీ మార్జిన్ 55.10శాతం నుంచి 37.10 శాతానికి తగ్గింది