సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్లో ఓ బాలిక (16)పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఇంటి నుంచి షాప్కు వెళ్తున్న ఆమెను కారులో వచ్చి కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు.
అమీన్పూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఆ బాలిక తల్లిదండ్రులు వాచ్ మెన్ డ్యూటీ చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. సరుకుల కోసం ఇంటి నుంచి షాప్కు వెళ్తున్న ఆమెను చక్రపురి కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. ఆమెను కిడ్నాప్ చేసి కారులో దూరంగా తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వాళ్లు పరారయ్యారు. ఆమె ఫోన్ ద్వారా విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి ఆమె కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.