గోమూత్రం, గోవు పేడతో కరోనా వైరస్ మహమ్మారి నివారించవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే. పరిసరాల్లో ఆవు మూత్రాన్ని పిచికారి చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ చెప్పారు. ఆమె మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
బంగ్లాదేశ్కు పశువుల అక్రమ రవాణాపై అస్సాం అసెంబ్లీలో చర్చ జరిగింది. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆవు పేడ, ఆవు మూత్రం ద్వారా కరోనాను పూర్తిగా పోగొట్టొచ్చని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు కూడా ఆవు మూత్రం, ఆవు పేడ సహాయపడతాయని చెప్పారు.
కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా ప్రయత్నిస్తుంటే.. ఆవు మూత్రం ద్వారా వైరస్ ను నియంత్రించవచ్చని హరిప్రియ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు.