ముంబై: రాజస్థాన్ కాంగ్రెస్లో నెల రోజులుగా నెలకొన్న సంక్షోభం ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. రెబల్ ఎమ్మెల్యేలతో కలసి పార్టీ అధినాయకత్వాన్ని కలసిన మాజీ డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ ప్రతిష్టంభనకు తెరదించారు. ఈ విషయంపై బీజేపీని విమర్శిస్తూ మహారాష్ట్రలో అధికార ప్రభుత్వ కూటమికి నాయకత్వం వహిస్తున్న శివసేన హాట్ కామెంట్స్ చేసింది. ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయిందని బీజేపీపై శివసేన మండిపడింది. రాజకీయ వికృత చేష్టలు ఓడిపోయిందన్నారు. బీజేపీకి గెహ్లాట్ గుణపాఠం నేర్పారన్నారు. ఆపరేషన్ లోటస్పై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆపరేషన్ నిర్వహించారని శివసేన మౌత్పీస్ సామ్నా తన ఎడిటోరియల్లో కామెంట్ చేసింది.
‘మహారాష్ట్రలో కూడా ఉదయం ఆపరేషన్ ఫెయిలైంది. ఇప్పటికైనా బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలి. కొంత మంది ఫేక్ డాక్టర్ల ప్రకారం మహారాష్ట్రలో ఆపరేషన్కు కొత్త డేట్ సెప్టెంబర్ అని తెలుస్తోంది. కరోనా ఇప్పట్లోపోయే సూచనలు కనిపించడం లేదు. నిరుద్యోగికత పెరుగుతోంది. ఎకానమీ కుంటుపడుతోంది. దాన్ని కాపాడే బదులు ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడంతో బీజేపీ బిజీగా ఉంది. ఇది రాజకీయ మానసిక అనారోగ్యానికి సూచన కాదా? షోలే ఫిల్మ్లో గబ్బర్ సింగ్లా ఆపరేషన్ లోటస్ అనే తీవ్రవాదాన్ని సృష్టించారు. రాజస్థాన్లో తాజా విఫల యత్నంతో రాజకీయ అనైతిక చేష్టలకు పరాభవం ఎదురైంది. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి గెహ్లాట్ ప్రతిదీ చేశారు. ఇతర గవర్నమెంట్స్ను పడగొట్టడానికి బీజేపీ ఎన్ని యత్నాలు చేస్తుందో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి గెహ్లాట్ అంతా చేశారు’ అని మరాఠీ డైలీ అయిన సామ్నా తన సంపాదకీయంలో రాసుకొచ్చింది.