
‘మంచు విష్ణు’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జిన్నా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఫిక్స్ చేశారు. అక్టోబర్ 16న సాయంత్రం 5.30 గంటలకు జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘జిన్నా జాతర’ ఈవెంట్ ప్రారంభం అవుతుందని, అందరూ ఆహ్వానితులే అంటూ ఓ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. విష్ణు సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంది. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది.
జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ సినిమా అంచనాలు పెంచేశాయి. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో నరేశ్, సురేశ్, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ జిన్నా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ నెల 21న భారీ స్ధాయిలో 'జిన్నా' మూవీని విడుదల చేయనున్నారు. జిన్నా టెంట్ హౌజ్ ఓనర్ గా మంచు విష్ణు కనిపిస్తాడు. ఊరంతా అప్పులు చేసిన పనికిమాలిన వాడిగా అతని గురించి చెప్పుకుంటారు. అప్పుల బాధ నుంచి బయట పడేయడానికి సాక్షాత్తూ లక్ష్మీ దేవి రావాలని విష్ణు అనుకుంటాడు. విష్ణు లైఫ్ లోకి ఎన్నారై సన్నీలియోన్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో జిన్నా టైం స్టార్ట్ అయిందని అనుకుంటుండగా.. కథలో ట్విస్ట్ మొదలవుతుంది. సన్నీలియోన్ శరీరంలోకి ఓ ఆత్మ ప్రవేశిస్తుంది. నన్ను చంపేస్తావా బాబాయ్ అంటున్న ఆ దెయ్యం వెనుక కథ ఏంటి?.. దాని బారి నుంచి హీరోయిన్ ని విష్ణు ఎలా కాపాడాడు? అనేది 'జిన్నా' సినిమా చూస్తేనే తెలుస్తుంది.