
మన ఊరు–మన బడి పనుల నిర్వాహణలో జాప్యం చేస్తున్న ఏఈ ని సస్పెండ్ చేయాలంటూ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో పరిగి పరిరక్షణ సమితి నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు నిరసన తెలిపారు. కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. మన ఊరు–మన బడి పథకం ద్వారా ఎంపికైన పాఠశాలల్లో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాప్యానికి కారణమైన ఏఈ రాఘవేందర్ ను విధుల నుండి వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరైన మౌళిక వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన మన ఊరు–మన బడి కార్యక్రమం ఇలాంటి అధికారుల వల్ల నిరుగారి పోతుందని నాయకులు విమర్శించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత ఏఈ పై చర్యలు తీసుకోవాలని.. ఆగిపోయిన పనులు వెంటనే ప్రారంభించి విద్యార్థులకు వాడుకలోకి వచ్చేలా చూడాలని పరిగి పరిరక్షణ సమితి నాయకులు కోరారు.