కార్పొరేట్లకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తీసుకొచ్చిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. దశల వారీగా ఎఫ్సీఐను నిర్వీర్యం చేస్తూ ఎంఎస్పీ తీసివేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. నూతన వ్యవసాయ బిల్లు అన్యాయమైనదని, అందుకే రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు .
లాభ నష్టాలతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్న గుత్తా… ఈ చట్టాలు కేంద్రం చేతుల్లోకి తీసుకోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతోందన్నారు. ‘నూతన విద్యుత్ విధానం కూడా రైతులకు శరాఘాతం వంటిది. ఎల్ఆర్ఎస్ వ్యవసాయ భూముల్లో నిర్మాణాలకు ఉచితంగా మార్పిడి గొప్ప ఊరట. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెసులుబాటు కల్పిస్తే.. కేంద్రం ఫెడరల్ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని గుత్తా ఆరోపించారు