జలంధర్: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ పదమూడో సీజన్ శనివారం ప్రారంభం కానుంది. మరికొన్ని గంటల్లో క్రికెట్ స్టార్స్ గ్రౌండ్లో దిగి అలరించబోతున్నారు. టోర్నీ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. పటిష్ట లైనప్తో ముంబై ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. టాప్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా, వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ల గైర్హాజరీలో చెన్నై టీమ్ కొంత బలహీనంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే గెలవాలని హర్భజన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను, రైనా లేకున్నా టీమ్ మీద పెద్దగా ప్రభావం పడబోదన్నాడు.
‘నాకు తెలిసి ఎవరైనా గెలవొచ్చు. ఈ టోర్నమెంట్ అలాంటిది మరి. టీ20 క్రికెట్లో ప్రతి మ్యాచ్లో శక్తి సామర్థ్యాల మేర చాలా మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. ఎక్కువ అనుభవం ఉన్న ప్లేయర్లు సీఎస్కే సొంతం. అవును, సీఎస్కేలో హర్భజన్, రైనా లేరు. మేం లేకపోవడం టీమ్ను మరీ అంతగా బాధించదు. షేన్ వాట్సన్, ఎంఎస్ ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ జడేజాల అనుభవం జట్టుకు పనికొస్తుంది. ఈ ఏడాది చెన్నైకి ఆడకపోవడాన్ని నేను మిస్సవ్వబోతున్నా. వాళ్లు నన్ను ఎంతగా మిస్సవుతున్నారో నాకు తెలీదు. నేను, రైనా లేదా మరెవ్వరో లేకున్నా టీమ్ ముందుకెళ్లగలదు’ అని భజ్జీ చెప్పాడు. వ్యక్తిగత కారణాల రీత్యా భజ్జీ ఈ సీజన్కు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.