శిక్ష ఆలస్యమైతే న్యాయ వ్యవస్థపై నమ్మకంపోతుంది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై మద్దతుకు కారణమిదే.
నిర్భయకు వెంటనే న్యాయం చెయ్యాలి.. రాలెగావ్ సిద్ధిలో హజారే మౌన దీక్ష.
పుణె: నిర్భయ కేసులో జాప్యాన్ని నిరసిస్తూ సోషల్ యాక్టివిస్ట్ అన్నా హజారే శుక్రవారం నుంచి మౌన దీక్ష చేపట్టారు. స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తూ.. నిర్భయకు వెంటనే న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానన్నారు. మౌన దీక్ష చేపట్టబోయే విషయాన్ని ప్రధాని మోడీకి ముందే చెప్పానన్నారు. ఈ నెల 20 నుంచి మౌన దీక్ష చేస్తానంటూ ఈ నెల 9న ప్రధానికి లెటర్ రాసిన విషయాన్ని హజారే గుర్తుచేశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. బాధితులకు న్యాయం జరగడంలో ఆలస్యమైతే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని హజారే చెప్పారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కు వచ్చిన ప్రజాస్పందనే దీనికి నిదర్శనమని అన్నారు.