వరల్డ్ కప్ హీరో వచ్చేస్తున్నాడు.. మూడో టీ20లో భారత్ గెలుస్తుందా..?

వరల్డ్ కప్ హీరో వచ్చేస్తున్నాడు.. మూడో టీ20లో భారత్ గెలుస్తుందా..?

ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా నేడు మూడో టీ 20 ఆడేందుకు సిద్ధమయ్యారు. గౌహతి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగబోతుంది. ఇప్పటికీ ఆడిన రెండు టీ 20 మ్యాచ్ లు గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు బోణీ కొట్టేందుకు ఆరాటపడుతుంది.

సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ జట్టు వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను తుది జట్టులోకి తీసుకు రానుంది. భారత్ పై వరల్డ్ కప్ ఫైనల్లో భారీ శతకంతో ఆసీస్ కు టైటిల్ అందించిన హెడ్ టీ20 స్క్వాడ్ లో ఉన్నాడు. తొలి రెండు టీ 20 మ్యాచ్ లకు ఈ స్టార్ ప్లేయర్ కు రెస్ట్ ఇచ్చారు. అయితే ఆసీస్ నేడు జరిగే మ్యాచ్ లో ఓడిపోతే సిరీస్ చేజారుతుంది. దీంతో హెడ్ ప్లేయింగ్ 11 లోకి రావడం దాదాపుగా ఖాయమైంది.

టీ 20ల్లో ఈ ఆసీస్ ఓపెనర్ కు పేలవ రికార్డ్ ఉన్నప్పటకీ.. హెడ్ మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హెడ్ తుది జట్టులోకి వస్తే షార్ట్ మీద వేటు పడే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే ఆసీస్ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
 
మరోవైపు భారత్  తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఆటగాళ్లందరూ ఫామ్ లోనే ఉండడంతో ఏ ఒక్కరిపైనా వేటు పడే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా తిరువనంత పురంలో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఆకట్టుకున్నారు. కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఇదే ఫామ్ ను కొనసాగించి సిరీస్ ను నేడు సిరీస్ ను ముగిస్తారో లేదో చూడాలి. సాయంత్రం 7 గంటలకు స్పోర్ట్స్ 18లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.