
శ్రీశైలం, వెలుగు : భారీ వర్షాలు పడుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. సోమవారం ఉదయం వరకు 3.80 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా సాయంత్రానికి 4.18 లక్షలకు చేరుకుంది. దీంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు పది గేట్లను 20 మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 884.40 (212.4385) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. గేట్లు, పవర్హౌస్ ద్వారా 5,41,693 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు.
సాగర్కు ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఎగువ నుంచి సాగర్కు 5,40,656 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో సాగర్ 26 గేట్లను ఎత్తి 5,03,268 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 586.80 అడుగుల నీరు నిల్వ ఉంది. కుడి కాల్వకు 6,324 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 28,644 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 26 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో సాగర్ను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు.