తమిళనాడులో భారీ వర్షాలు

తమిళనాడులో భారీ వర్షాలు

చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా 24 గంటలుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలతోపాటు పాండిచ్చేరిలోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తంజావూర్​లో నీటి గుంటలో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో తుతికోరిన్​ జిల్లాలో అత్యధికంగా 19 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. కడ్డలూర్ లో 17 సెం.మీ., తిరునల్వేలి 15, కాంచీపురం 13సెం.మీ. వర్షపాతం నమోదైంది. వచ్చే 24 గంటల నుంచి 48 గంటల వరకు రామనాథపురం, తిరునల్వేలి, తుతికోరిన్, వెల్లూర్, తిరువల్లూర్, తిరువన్నామలై, జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు పాండిచ్చేరిని కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.