
హైదరాబాద్:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండం బలపడే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే 4 రోజులు తెలంగాణ వర్షాలుంటాయని చెప్పారు. శనివారం, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరఈశాన్య జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు. శనివారం (ఆగస్టు 31) 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక శుక్రవారం అల్పపీడనం ప్రభావంతో పలుజిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. జూరాలా, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది.
రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని చెప్పారు. అల్పపీడనం రేపు వాయుగుండం బలపడే అవకాశముం దన్నారు. వచ్చే 4 రోజులు రాష్ట్రంలో వర్షాలుంటాయనన్నారు. అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టిచ్చారు. ఇవాళ 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని తెలిపారు అధికారులు.
ఉత్తరఈశాన్య జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. శనివారం 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్టిచ్చారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపారు. మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నగరంలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమైంది. పలు జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లాలో కుండపోత వాన కురిసింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టుప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గోవిందుపల్లెలోని వెంకటాద్రి నగర్ బ్రిడ్జి నీట మునిగింది.
బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఎమర్జెన్సీ అవసరాల్లో ప్రజలను బుల్డోజర్ల సహాయంతో బ్రిడ్జి దాటించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోనూ పలు మండలాల్లో భారీవాన పడింది.వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు.. వర్షంలోనే స్వామివారిని దర్శించుకున్నారు.
ఎగువరాష్ట్రాల్లో వర్షాలకు కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కృష్ణానది ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చిచేరుతుంది. జూరాలా, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. జూరాలకు 3లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో..42గేట్లు ఎత్తి 3లక్షల 6వేల 494 క్యూసెక్కుల నీరు దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు.
శ్రీశైలం నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. 2లక్షల 86 వేల 434 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 10 గేట్లు ఎత్తి 3లక్షల 48 వేల 235 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా.. ప్రస్తుతం 884 అడుగులకు చేరింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ కు భారీవరద వస్తోంది. 26 గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ కు ఇన్ ఫ్లో 2లక్షల 98 వేల 327 క్యూసెక్కులుండగా.. 3లక్షల 32వేల 836 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 589 అడుగులు కొనసాగుతోంది.