లానినా ప్రభావం .. జూలైలో మస్తు వానలు..

లానినా ప్రభావం ..  జూలైలో మస్తు వానలు..

హైదరాబాద్​, వెలుగు: వచ్చే నెలలో లానినా ప్రభావంతో దండిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.  ప్రస్తుతం పసిఫిక్​లో ఎల్​నినో పరిస్థితులు దాదాపుగా పోయాయని పేర్కొంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్​గానే ఉన్నా.. దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయని తెలిపింది. వారంపాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు.. మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో సెంట్రల్​ ఇండియాను దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. 

కాగా, శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్​, ఉమ్మడి మహబూబ్​నగర్​, ములుగు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్​ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూరులో అతిభారీ వర్షం పడింది. అక్కడ 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా గుడాపూర్​లో 4.8, నారాయణపేట జిల్లా కోస్గిలో 4.5, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 4.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 3.3, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కుంచవెల్లి, వాంకిడిల్లో 3.3, ఖమ్మం జిల్లా ప్రకాశ్​ నగర్​లో 3.3, రంగారెడ్డి జిల్లా రాయచూరులో 3.2 సెంటమీటీర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. మిగతా జిల్లాల్లో 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షం కురిసింది. 

టెంపరేచర్లు తగ్గుముఖం

రాష్ట్రంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లోనూ 39 డిగ్రీలలోపే టెంపరేచర్లు రికార్డయ్యాయి. కాగా, రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం 12 జిల్లాలు, సోమవారం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్​లోనూ రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.