- భారీ ధర వస్తుందని అంచనాలు
హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలో బుధవారం నుంచి హెచ్ఎండీఏ భూముల వేలం మళ్లీ మొదలవనుంది. వేలాన్ని 9వ తేదీ వరకు నిర్వహించనున్నామని, మోకిలా, బాచుపల్లితోపాటు కోకాపేట, ఇన్ముల్నర్వ, సిటీలోని మరికొన్ని కీలక ప్రాంతాల్లో చిన్న బిట్ల వేలం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రీబిడ్ సమావేశాలకు పలు ప్రముఖ కంపెనీలు, రియల్ ఎస్టేట్వ్యాపారులు, బిల్డర్లు హాజరు కావడంతో ఈసారి అనుకున్న టార్గెట్కంటే భారీగా ఆదాయం సమకూరుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు.
గతంలో లక్షకు పైనే..
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మోకిలతోపాటు బాచుపల్లిలో బుధవారం 35 చొప్పున ప్లాట్లను వేలం వేయనున్నారు. మొకిలాలో సర్వే నంబర్96/పిలో 165 ఎకరాల 37 గంటల ప్రభుత్వ భూమిలో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మించుకునేందుకు 1,293 ప్లాట్లను డెవలప్చేశారు. వీటిలో 100 ప్లాట్లను జూన్30న వేలం వేయగా మంచి స్పందన వచ్చింది. కనీస ధర చదరపు గజానికి రూ.50 వేలుగా నిర్ణయించగా రూ.1,09,500 పలికింది. ఇప్పుడు 300 నుంచి 500 గజాల ప్లాట్లను రెడీ చేసి ఒక్కో ప్లాట్కు కనీస ధర రూ.55వేలుగా నిర్ణయించారు. ఈసారి గజానికి లక్షన్నర పైగానే పలికే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, హైటెక్సిటీకి సమీపంలోనేని బాచుపల్లి సర్వే నంబర్39, 40లలో ఇండిపెండెంట్ఇండ్లు, ఆఫీసులు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుకూలంగా 266.67 చదరపు గజాల నుంచి 499.96 చదరపు గజాల సైజుల్లో 35 ప్లాట్లను వేలం వేస్తున్నారు. ఇక్కడ కనీస ధర రూ.45 వేలు నిర్ణయించగా, భారీ ధర వస్తుందని భావిస్తున్నారు.
