షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎన్సీఓ) సమిట్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రాంతానికైనా నీరు జీవనాధారమని, దానిని ఎప్పటికీ రాజకీయ ఆయుధంగా, ఒత్తిడి సాధనంగా ఉపయోగించకూడదని అన్నారు. సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) అంతర్జాతీయంగా కట్టుబడి అమలు చేయాల్సిన ఒప్పందమని, దాన్ని ఏకపక్షంగా పక్కన పెట్టకూడదని పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం పాకిస్తాన్కు అతిపెద్ద ముప్పుగా మారిందని, గత రెండున్నర దశాబ్దాల్లో ఉగ్రవాద వ్యతిరేక పోరులో 90 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని షరీఫ్ అన్నారు. 150 బిలియన్ డాలర్లకుపైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. ఉగ్రవాదులకు అఫ్గానిస్తాన్ ఆశ్రయం ఇస్తున్నన్ని రోజులు శాశ్వత శాంతి సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని, అమెరికా – ఇరాన్ మధ్య సయోధ్యకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందని చెప్పారు.
మోదీని కట్ చేసి, ఫొటో పోస్ట్
ఎస్సీవో సదస్సు సందర్భంగా పాక్ తన వంకరబుద్ధి చాటుకుంది. సదస్సులో సభ్య దేశాల అధినేతలంతా కలిసి గ్రూప్ ఫొటో దిగగా.. అందులోంచి మోదీ తోపాటు మరికొందరు నేతలు లేకుండా ఫొటోను క్రాప్ చేసింది. తాను మధ్యలో ఉన్నట్టు కనిపించేలా చేసిన ఫొటోను పాక్ ప్రధాని షరీఫ్ షేర్ చేశారు. కానీ, మోదీ మాత్రం అందరూ ఉన్న ఫుల్ ఫొటోను షేర్ చేశారు. దీంతో పాక్ వంకర బుద్ధిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
