- డిమాండ్ జోరు ఏమాత్రం తగ్గలేదు
- ఎనరాక్ రిపోర్టు
న్యూఢిల్లీ : దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో ఈ ఏడాది ఇండ్ల అమ్మకాలు రికార్డు లెవెల్కు చేరతాయని ఒక రిపోర్టు వెల్లడించింది. ఏడు సిటీలలోనూ గిరాకీ ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు 3.6 లక్షల యూనిట్లకు చేరడం ఖాయమని ప్రాపర్టీ కన్సల్టింగ్కంపెనీ ఎనరాక్ రిపోర్టు తెలిపింది. ఓ వైపు వడ్డీ రేట్లు, ప్రాపర్టీల రేట్లు పెరుగుతున్నప్పటికీ గిరాకీ ఊపందుకోవడం విశేషమని పేర్కొంది. ఇంతకు ముందు 2014 లో ఏడు ప్రధాన సిటీలలోనూ కలిపి అత్యధికంగా 3,42,980 ఇండ్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణెలను ఏడు ప్రధానమైన సిటీలుగా ఎనరాక్ పరిగణిస్తోంది.
ఎనరాక్ డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో ఇండ్ల అమ్మకాలు 2,72,710 యూనిట్లకు చేరాయి. అంటే ఇండ్ల అమ్మకాలు 2019 (కొవిడ్కు ముందు) లోని 2,61,360 యూనిట్ల సంఖ్యను ఇప్పటికే మించిపోయాయి. హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు కొంత పెరుగుతున్నా పండగల సీజన్లోనూ ఇండ్ల అమ్మకాల జోరు కొనసాగుతోందని ఎనరాక్ ఈ రిపోర్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2022 కేలండర్ సంవత్సరంలో ఇండ్ల అమ్మకాలు రికార్డు లెవెల్లో 3.6 లక్షల యూనిట్లకు చేరడం ఖాయమనిపిస్తోందని తెలిపింది. హౌసింగ్లోన్లపై వడ్డీ రేట్లు ఇటీవలి కాలంలో 6.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగాయని వివరించింది.
2020 లో కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా ఇండ్ల అమ్మకాలు 1,38,340 యూనిట్లకు పడిపోయాయి. ఆ తర్వాత ఏడాది అంటే 2021 లో డిమాండ్ కొంత పుంజుకోవడంతో అమ్మకాలు మళ్లీ 2,36,520 యూనిట్లకు పెరిగినట్లు ఎనరాక్ రిపోర్టు వెల్లడించింది. అయితే కొవిడ్ ముందు లెవెల్స్కు మాత్రం ఈ సేల్స్ చేరలేదు. దేశంలో హౌసింగ్ డిమాండ్ రాబోయే కొన్నేళ్లలో పటిష్టంగా ఉండబోతోందని ఇటీవలే హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ ఎండీ విపుల్ రుంగ్టా కూడా చెప్పారు. డెమొగ్రఫిక్స్ ఇందుకు ఒక కారణమని అన్నారు. హోమ్లోన్లపై ఆధారపడటం కొంత తగ్గుతోందని పేర్కొన్నారు.
పెద్ద డెవలపర్ల వైపే కస్టమర్ల చూపు...
పెద్ద బిల్డర్లు, లిస్టెడ్ డెవలపర్ల ప్రాజెక్టులపైనే కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు కూడా ఈ రిపోర్టులో ఎనరాక్ తెలిపింది. 2022లో కొత్త ప్రాజెక్టుల లాంఛ్ మాత్రం 2014 తో పోలిస్తే తక్కువగానే ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది. 2014లో దేశంలోని ఏడు నగరాలలోనూ కలిపి 5,45,230 యూనిట్లతో ప్రాజెక్టులు లాంఛ్ అయినట్లు పేర్కొంది. ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఈ ఏడాది కొత్త లాంఛ్లు 3.4 లక్షల యూనిట్లకు మించే అవకాశం లేదని వివరించింది. 2022లో ఇప్పటి దాకా అంటే 9 నెలల్లో మొత్తం 2,64,780 యూనిట్లతో ప్రాజెక్టులు లాంఛ్చేసినట్లు తెలిపింది. గత ఏడాదిన్నర కాలంలో చూస్తే దేశంలోని పెద్ద డెవలపర్లందరి సేల్స్ బుకింగ్స్ ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది. యాన్యువల్ సేల్స్ బుకింగ్స్లో ప్రెస్టీజ్ ఎస్టేట్స్, మాక్రోటెక్ డెవలపర్స్(గతంలో లోధా), గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్ వంటివి ముందున్నాయని వివరించింది. ఒబెరాయ్ రియాల్టీ, శోభ, మహీంద్రా లైఫ్స్పేస్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజస్, పూర్వాంకర లిమిటెడ్, శ్రీరామ్ ప్రాపర్టీస్ వంటి కంపెనీలు పైన పేర్కొన్న పెద్ద డెవలపర్లకు గట్టి పోటీనే ఇస్తున్నట్లు కూడా ఎనరాక్ వెల్లడించింది.
ఏడాది ఇండ్ల అమ్మకాలు
2013 3,18,400
2014 3,42,980
2015 3,08,250
2016 2,39,260
2017 2,11,140
2018 2,48,310
2019 2,61,360
ఇండియాలో రెసిడెన్షియల్ మార్కెట్ చరిత్ర సృష్టిం చబోతోంది. గతంలోని అమ్మకాలను అధిగమిస్తుండటమే దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. పండగల సీజన్లోనూ అద్భుతమైన డిమాండ్ కనిపిస్తోంది. కొవిడ్ తర్వాత సొంత ఇల్లు కావాలనే ఆలోచన బాగా అధికమైంది. గత కొన్ని నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను 190 బేసిస్ పాయింట్ల దాకా పెంచింది. మరోవైపు ప్రాపర్టీల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ, గతంలోలాగా ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్ ఆఫర్లు, డిస్కౌంట్లు కనబడడం లేదు. ఇది గమనించాలి. కిందటేడాది ఇండ్ల రేట్లు 10 % దాకా పెరిగాయి.
‑ అనూజ్పూరి, ఎనరాక్ గ్రూప్ ఛైర్మన్