- పండగ సీజన్ సేల్స్ పెంచుకోవాలని కంపెనీల టార్గెట్
వెలుగు, బిజినెస్ డెస్క్: పండగల సీజన్ మొదలవనున్న నేపథ్యంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రో ఓవెన్ల అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్లతో ముంచెత్తుతున్నాయి. వారంటీ కాలం పెంపు, క్యాష్ బాక్స్, ఈజీ ఫైనాన్స్ స్కీములతో కస్టమర్లను ఊరిస్తున్నాయి. వేసవిలో కరోనా సెకండ్వేవ్ ఎఫెక్ట్తో పోగొట్టుకున్న సేల్స్ను పండగ సీజన్లో భర్తీ చేసుకోవాలని అప్లయన్సెస్ కంపెనీలు చూస్తున్నాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, ఆ తర్వాత కేరళలో పెద్ద ఫెస్టివల్ ఓనం ఉండటంతో ఇప్పటి నుంచే సందడి మొదలెట్టాయి. ఓనంతోటే పండగల అమ్మకాలు మన దేశంలో బిగినవుతాయి. ఈ పండగ కోసం పది రోజుల పాటు ఫెస్టివల్ ఆఫర్లను అందుబాటులో ఉంచాలని అప్లయన్సెస్ కంపెనీలు ప్లాన్లు వేస్తున్నాయి.
సైనికుల కోసం ప్రత్యేక ఆఫర్లు....
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రో ఓవెన్లు సహా దేశంలో వైట్గూడ్స్ అమ్మకాలు ఏటా రూ. 65,000 కోట్ల దాకా ఉంటాయి. ఈ సేల్స్ ప్రతీ సంవత్సరం 15 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఏటా జరిగే అమ్మకాలలో 55 నుంచి 60 శాతం అమ్మకాలు ఆగస్టు–డిసెంబర్ మధ్యలోనే జరుగుతాయి. ఓనంతో మొదలై, ఆ తర్వాత దసరా, దీపావళి, క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల దాకా అప్లయన్సెస్ అమ్మకాలు కొనసాగుతాయి. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కన్సూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్లన్నీ ఈసారి సైనికుల కోసం ప్రత్యేక ఆఫర్లు తెస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ ఈ దిశలో వారి కోసం ప్రత్యేక ఆఫర్ తెచ్చింది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్డీ) రేట్లకే శాంసంగ్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, వాషింగ్ మెషిన్లను ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ ప్లాజా స్టోర్లలో పనిచేస్తున్న, రిటైరయిన సైనికులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ప్లాజా స్టోర్లలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులన్నీ అందుబాటులో ఉంటాయి. పండగ సీజన్ సందర్భంగా సైనికులు, మాజీ సైనికుల కోసం తమ స్టోర్లలో ప్రత్యేక బెనిఫిట్స్ కల్పిస్తున్నట్లు శాంసంగ్ తెలిపింది.
సౌత్ ఇండియా వాటా 25 శాతం..
ఏసీ, అప్లయన్సెస్ అమ్మకాలలో 25 శాతం సౌత్ ఇండియా నుంచే వస్తాయి. ఈ రాష్ట్రాల్లో సేల్స్ వేగంగా పెరుగుతున్నాయి. సెకండ్వేవ్ ఎఫెక్ట్తో పోగొట్టుకున్న అమ్మకాలను ఈ సారి పండగ సీజన్లో రాబట్టుకోవడానికి కంపెనీలు ఆఫర్లను గుమ్మరిస్తున్నాయి.
2020లో పండగ సేల్స్ లేవు..
కిందటేడాది పండగల సీజన్లో కరోనా ఎఫెక్ట్ వల్ల అమ్మకాలు జోరుగా సాగలేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ల ద్వారా అప్లయన్సెస్ సేల్స్ తగ్గకున్నా, ఆఫ్లైన్ అంటే స్టోర్ల ద్వారా సేల్స్ బాగా పడిపోయాయి. ఈ పండగల సీజన్లోనైనా అమ్మకాలు భారీగా జరగాలని అప్లయన్సెస్ కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. ఇండస్ట్రీ రెవెన్యూలో 70 శాతం ఆఫ్లైన్ అమ్మకాల ద్వారానే ఇప్పటికీ వస్తోంది. బాష్, సీమెన్స్, గాజ్నావ్ బ్రాండ్లను అమ్మే బీఎస్హెచ్ హోమ్ అప్లయన్సెస్ కూడా ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 8–22 మధ్యలో సేల్స్పై సూపర్ క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు తెలిపింది. రూ. 999 కే మూడేళ్ల అదనపు వారంటీ కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్ మాత్రం నవంబర్ 30 దాకా ఉంటుందని వివరించింది. ఈఎంఐ ఆప్షన్లూ ఉంటాయని పేర్కొంది. స్మాల్ అప్లయన్సెస్కు ఎక్స్చేంజ్ ఆఫరూ ఉంటుందని కంపెనీ ప్రకటించింది.