ఉస్మానియా ఆస్పత్రి గురించి ఎవరికి చెప్పాలో… ఏమి చెప్పాలో అర్థం కావడం లేదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. తాను ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సందర్భంలో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకొని ట్రీట్ మెంట్ చేయడాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి ఎప్పుడు కూలిపోతుందో తెలియడంలేదని, చిన్నపాటి వర్షానికే వరదలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ కు ప్రజల ప్రాణాల గురించి కనీస ఆలోచనలేదని విమర్శించారు. ఆస్పత్రిలో రోగులు, డాక్టర్లు ఇబ్బందిపడుతుంటే కేసీఆర్ చూసేందుకు రాకపోవడం ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. హెల్త్ మినిస్టర్ తో సహా రాష్ట్రం లో ఉన్న మంత్రులు రబ్బర్ స్టాంప్ లే..వాళ్ళ వల్ల ఏమి కాదని దుయ్యబట్టారు. కేసీఆర్ నిర్లక్ష్యం వీడి..ఉస్మానియా ఆస్పత్రికి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని, రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల కోసం ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కూలిపోతే ప్రజలు కేసీఆర్ పై మర్డర్ కేసు పెడతారని ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.