లాక్ డౌన్ నేపథ్యంలో షాపులన్నీ మూతపడడంతో ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతున్నారు. జనసంచారం కూడా లేకపోవడంతో షాపుల్లో చొరబడి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. మద్యం షాపుల్లో లిక్కర్ బాటిల్స్ను కూడా మాయం చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్లోని ఎంజే మార్కెట్ సమీపంలో ఉన్న కరాచీ బేకరీలో భారీ చోరీకి ప్లాన్ చేశారు కొందరు దుండగులు. మంగళవారం రాత్రి షాప్ వెనుక ఉన్న షెటర్ తొలిగించి, లోపల ఉన్న లాకర్ పగలగొట్టి అందులో ఉన్న డబ్బును కాజేద్దామనుకున్నారు.
ముందుగా కౌంటర్ లో ఉన్న రూ.30 వేలు దోచుకొని , ఆ తర్వాత సేఫ్ లాకర్ ని తెరవబోయారు . సేఫ్ లాకర్ తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఇక చేసేదేమీ లేక దొరికిన డబ్బుతో వెనుదిరిగారు.
బుధవారం ఉదయం బేకరీని తెరిచిన యాజమాన్యం .. చోరీ జరిగినట్లు గుర్తించింది. కౌంటర్ లోని రూ.30 వేలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. సేఫ్ లాకర్ ను చెక్ చూసి చూడగా అందులో రూ. 9 లక్షల 60 వేలు లభ్యం కావడంతో ఉపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గురించే పనిలో ఉన్న పోలీసులు.