న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్కు ముందు ఇండియా స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాకు షాక్ తగిలింది. డోప్ పరీక్షకు శాంపిల్స్ ఇవ్వని కారణంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఈ నెలలో జరిగే ఒలింపిక్స్ ట్రయల్స్కు అతను అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ కోసం మార్చి 10న సోనేపట్లో జరిగిన ట్రయల్స్లో ఓడిన బజ్రంగ్ నాడా అధికారులకు శాంపిల్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దాంతో నాడా ఏప్రిల్ 23న అతనిపై ప్రాథమిక సస్పెన్షన్ను విధించింది. మే 7లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు సస్పెన్షన్ను దాచి పెట్టిన నాడా ఆదివారం బహిర్గతం చేసింది. అయితే, శాంపిల్స్ ఇచ్చేందుకు తానెప్పుడూ నిరాకరించలేదని బజ్రంగ్ చెప్పాడు. శాంపిల్స్ సేకరణ కోసం గడువు ముగిసిన టెస్ట్ కిట్లు ఇచ్చారన్నాడు. సస్పెన్షన్పై కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశాడు.