కొండాకు మద్దతుగా కొడుకు, కోడలు ప్రచారం

కొండాకు మద్దతుగా కొడుకు, కోడలు ప్రచారం

వికారాబాద్, వెలుగు : చేవెళ్ల లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.  ఆదివారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలోని పలు గ్రామాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు విశ్వజిత్ రెడ్డి, కోడలు రిషికారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వజిత్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి లోక్ సభ సభ్యుడిగా చేవెళ్ల ప్రజలు సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. 

మోదీని మరోసారి ప్రధాని చేయడానికి దేశం మొత్తం సిద్ధంగా ఉందని, అందులో చేవెళ్ల ప్రజలు కూడా భాగం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, వీటిని మరింత చేరువ చేసేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి విజన్ ఉన్న నేతను ఎన్నుకోవాలని ఆయన సూచించారు. ప్రచారంలో  బీజేపీ నేతలు భుజంగ రెడ్డి, రాములు, కార్యకర్తలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.