హైదరాబాద్, వెలుగు: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఇండియా షట్లర్, హైదరాబాద్కు చెందిన సి.ఎం. శశిధర్ 45 ప్లస్ మెన్స్ సింగిల్స్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. కొరియాలోని జియోంజులో ఈ నెల11 నుంచి 18వ తేదీ వరకు జరిగిన ఈ టోర్నీలో సత్తా చాటి నగరానికి తిరిగొచ్చిన శశిధర్ను కౌకూర్లోని సీఎంఎస్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఘనంగా సన్మానించారు. కోచ్ బాల హనుమంతరావు, మేజర్ జనరల్ రాజేష్ కుంద్రా అతడిని సత్కరించారు.
ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ ఈ మెడల్ నెగ్గాలన్నది ఇది నా కల అని, అది నిజమైనందుకు సంతోషంగా ఉందన్నారు. గత రెండు బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ సీనియర్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకాలతో సంతృప్తి చెందానన్నాడు. ఈ ఏడాది టోర్నీ కోసం కఠినమైన శిక్షణ తీసుకొని మెరుగైన ఫలితం సాధించానని చెప్పాడు. వచ్చే ఏడాది గోల్డ్ నెగ్గేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో మాజీ షట్లర్లు, అకాడమీ ట్రెయినీలు పాల్గొన్నారు.