షాద్‌నగర్ మార్కెట్ యార్డులో..అర్థరాత్రి దొంగల హల్ చల్

షాద్‌నగర్ మార్కెట్ యార్డులో..అర్థరాత్రి దొంగల హల్ చల్

8 దుకాణాల షట్టర్లు పగులగొట్టి రూ. 3లక్షల నగదు అపహరణ

రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట వద్ద ఉన్న మార్కెట్ యార్డులో నిన్న అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. దాదాపు ఎనిమిది షాపుల షట్టర్లను బెండ్ చేసి లోపలికి చొరబడ్డారు. సుమారు మూడు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లినట్టు బాధిత ట్రేడర్స్ వర్గాలు తెలిపాయి. ట్రేడర్స్ షాప్ నెంబర్స్ 2,4,5,6,16, 17, 21 తదితర షాపుల్లో దొంగతనాలు జరిగినట్లు బాధిత వర్గాలు చెబుతున్నాయి. ట్రేడర్స్ బాధితులు శివ శంకర్ ట్రేడింగ్ కంపెనీ షాపులో ఒక లక్షా 70 వేల రూపాయలు, రమణ షాపులో 2 వేలు, మల్లప్ప షాపులో 3వేలు, ఓం సాయి ట్రేడర్స్ లో 50వేలు, వెంకటేశ్వర ట్రేడర్స్ లో 3వేలు, అమరవది కృష్ణయ్య షాపులో 3వేలు, మల్లేశ్వరస్వామి షాపులో స్వల్ప నగదును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

దాదాపు మూడు లక్షల రూపాయల వరకు నగదు చోరీకి గురైందని బాధితులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అర్ధరాత్రి దాటిన తర్వాత  ఈ దొంగతనాలు జరిగినట్లుగా ట్రేడర్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బీహార్ కు చెందిన హమాలీలు పక్కన షట్టర్లో పడుకొని ఉన్నారు. వారికి ఎలాంటి అలికిడి వినిపించకుండా చోరీకి పాల్పడడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీహార్ హమాలీలు అలవాటు ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు లేచి రెడీ అయ్యేందుకు తయారవుతూ షాపుల వైపు చూడగా కొన్ని షట్టర్లు సగం తెరచి కనిపించాయి. బలమైన వస్తువులతో షట్టర్లను పెకలించినట్టు గుర్తించారు. వెంటనే షాపుల యజమానులకు ఫోన్లు చేయగా వారు హుటాహుటిన మార్కెట్టు వద్దకు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.