
హైదరాబాద్: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) దూకుడుగా ముందుకెళుతోంది. గడచిన 8 నెలల్లో 179 కేసులు నమోదు చేసి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇప్పటి వరకు 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది. మొత్తం రూ.44.30 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసింది. గత నెల ఆగస్ట్లో ఏసీబీ 31 కేసులు నమోదు చేసింది. 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులను అరెస్ట్ చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. ఉపేక్షించొద్దని తేల్చిచెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్ఫ్రీ నంబర్ను, వాట్సాప్నంబర్ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు.
బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి.. లంచగొండులకు చెక్పెడ్తున్నారు. అక్రమాస్తులు ఉన్న ఆఫీసర్లనూ గుర్తిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారుల ఇండ్లలో ఇటీవల తనిఖీలు చేసి.. వందల కోట్లు విలువ చేసే ఆస్తులను ఏసీబీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ALSO READ : రాజ్యాంగ రక్షణ కోసమే సుదర్శన్ రెడ్డి పోటీ...
ప్రతి నెల సగటున 20 మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. సగటున నెలకు 20 కేసులు రికార్డవుతుండగా.. 20 మంది అరెస్టవుతున్నారు. ఈ ఎనిమిది నెలల్లో పట్టుబడ్డవాళ్లలో 20 మందికి పైగా మహిళా అధికారులతో పాటు పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులు, పట్టుబడ్డ అధికారుల లెక్కలు చూస్తే.. అవినీతిలో ఫస్ట్ ప్లేస్లో రెవెన్యూ శాఖ, రెండో ప్లేస్లో పోలీస్ శాఖ, మూడో ప్లేస్లో మున్సిపల్ శాఖ ఉన్నాయి.