IND vs AFG, 2nd T20I : జైస్వాల్, దూబే మెరుపులు..ఆఫ్ఘనిస్తాన్‌‌ను చిత్తు చేసిన భారత్

IND vs AFG, 2nd T20I : జైస్వాల్, దూబే మెరుపులు..ఆఫ్ఘనిస్తాన్‌‌ను చిత్తు చేసిన భారత్

ఆఫ్ఘనిస్తాన్ పై జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను అలవోకగా ఆడేశారు. రోహిత్ త్వరగా ఔటైనా.. 29 పరుగులు చేసి కోహ్లీ పెవిలియన్ చేరినా.. భారత్ ఎక్కడా తడబడలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రారంభం నుంచి ఆఫ్ఘన్ బౌలర్లను చీల్చి చెండాడు.   

34 బంతుల్లో 6 సిక్సులు, 5 ఫోర్లతో 68 పరుగులు చేసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. మరో ఎండ్ లో శివమ్ దూబే శివాలెత్తాడు. వరుస సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. బంతి ఎక్కడ పడినా బౌండరీయే లక్ష్యంగా పెను విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరికి భారీ భాగస్వామ్యంతో టీమిండియా సునాయాసంగా విజయాన్ని అందుకుంది. దూబే 32 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. నైబ్ 35 బంతుల్లోనే 57 పరుగులు చేసి భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు పడినా.. చివర్లో కరీం జనత్ (10 బంతుల్లో 20), ముజీబుర్ రెహమాన్ (9 బంతుల్లో 21) చెలరేగి ఆడారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోగా.. బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. దూబేకు ఒక వికెట్ లభించింది.