
- టంగ్, స్టోక్స్కు చెరో 4 వికెట్లు
- తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 209/3
- పోప్ సూపర్ సెంచరీ
లీడ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (227 బాల్స్లో 19 ఫోర్లు, 1 సిక్స్తో 147)కు తోడు, రిషబ్ పంత్ (178 బాల్స్లో 12 ఫోర్లు, 6 సిక్స్లతో 134) కూడా సెంచరీతో దుమ్మురేపడంతో.. శనివారం రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 113 ఓవర్లలో 471 రన్స్కు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్49 ఓవర్లకు 209/3 స్కోరుతో దీటుగా బదులిస్తోంది. ఒలీ పోప్ (100 బ్యాటింగ్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పోప్తో పాటు హ్యారీ బ్రూక్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బుమ్రా 3 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఇంగ్లిష్ టీమ్ ఇంకా 262 రన్స్ వెనకబడి ఉంది.
లోయర్ ఢమాల్..
359/3 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన గిల్, పంత్ను స్టార్టింగ్లో ఇంగ్లండ్ బౌలర్లు పెద్దగా ఇబ్బందిపెట్టలేదు. సెషన్ తొలి గంట మొత్తం ఈ ఇద్దరి ఆధిపత్యమే నడిచింది. దాదాపు 16 ఓవర్లు ఈ ఇద్దరు హోమ్ టీమ్ బౌలింగ్ను దీటుగా ఎదుర్కొన్నారు. షోయబ్ బషీర్ (1/100) వేసిన ఇన్నింగ్స్ వందో ఓవర్లో భారీ సిక్స్తో పంత్ 146 బాల్స్లో ఏడో సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే తన సిగ్నేచర్ ‘సోమర్సాల్ట్’తో ఫ్యాన్స్కు అభివాదం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఓవర్నైట్ స్కోరుకు 95 రన్స్ జత చేశారు. అయితే క్రీజులో పాతుకుపోయిన ఈ జంటను 102వ ఓవర్లో బషీరే విడదీశాడు.
అతను వేసిన ఫ్లైట్ టర్నింగ్ బాల్కు భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో గిల్ డీప్ బ్యాక్వర్డ్లో టంగ్ చేతికి చిక్కాడు. ఫలితంగా నాలుగో వికెట్కు 209 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఇక్కడి నుంచి ఇంగ్లిష్ బౌలర్లు పట్టు బిగించారు. ఓ ఎండ్లో పంత్ను ఆడిస్తూనే.. రెండో ఎండ్లో లోయర్ ఆర్డర్ను దెబ్బతీశారు. ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన వెటరన్ కరుణ్ నాయర్ (0) ఘోరంగా నిరాశపర్చాడు. నాలుగు ఓవర్ల తర్వాత స్టోక్స్ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్స్లో పోప్కు క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు.
మరో మూడు ఓవర్ల తర్వాత అద్బుతమైన ఇన్ కమింగ్ డెలివరీతో టంగ్.. పంత్ను బోల్తా కొట్టించాడు. ఫలితంగా ఇండియా 457/7తో లంచ్కు వెళ్లింది. లంచ్ తర్వాత ఒక్కరు కూడా నిలబడలేదు. ఐదు ఓవర్లలోనే ఇన్నింగ్స్ ముగిసింది. రవీంద్ర జడేజా (11), శార్దూల్ ఠాకూర్ (1), బుమ్రా (0), ప్రసిధ్ కృష్ణ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓవరాల్గా ఇండియా 112 రన్స్కు చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.
బుమ్రా ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చినా..
వర్షం వల్ల కాస్త ఆలస్యంగా మొదలైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు బుమ్రా ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చినా మంచి స్కోరే చేసింది. ఇన్నింగ్ తొలి ఓవర్లోనే జాక్ క్రాలీ (4)ని ఔట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. మిడిల్ స్టంప్పై వేసిన ఔట్ స్వింగర్ను లెగ్ సైడ్ ఆడటానికి ట్రై చేశాడు. కానీ బాల్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో కరుణ్ నాయర్ చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా స్కోరు 4/1గా మారింది. అయితే బుమ్రా ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని మిగతా బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు.
బెన్ డకెట్ (62), ఒలీ పోప్ను నియంత్రించడంలో ఫెయిలయ్యారు. ఫలితంగా ఈ ఇద్దరు స్వేచ్ఛగా షాట్లు ఆడారు. ఈ క్రమంలో డకెట్ 68 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే రెండో స్పెల్కు దిగిన బుమ్రా 29వ ఓవర్లో డకెట్ను ఇన్ స్వింగర్తో క్లీన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్కు 122 రన్స్ జతయ్యాయి. 64 బాల్స్లో ఫిఫ్టీ కొట్టిన పోప్కు రూట్ అండగా నిలిచాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న పోప్ 125 బాల్స్లో సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో మళ్లీ బౌలింగ్కు దిగిన బుమ్రా.. రూట్ను ఔట్ చేయడంతో మూడో వికెట్కు 80 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 113 ఓవర్లలో 471 ఆలౌట్ (శుభ్మన్ గిల్ 147, రిషబ్ పంత్ (134, జోష్ టంగ్ 4/86, బెన్ స్టోక్స్ 4/66). ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 49 ఓవర్లలో 209/3 (పోప్ 100*, డకెట్ 62, బుమ్రా 3/48).
1 2021 నుంచి టెస్ట్ క్రికెట్లో తొలి ఓవర్లోనే వికెట్ తీసిన తొలి బౌలర్గా బుమ్రా (8) అరుదైన రికార్డును సృష్టించాడు. రబాడ, స్టార్క్ (7) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.
7 టీమిండియా వికెట్ కీపర్గా టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ధోనీ (6) రికార్డును రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. వృద్ధిమాన్ సాహా, సయ్యద్ కిర్మాణీ, ఫారూక్ ఇంజనీర్ తలా రెండేసి సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నయన్ మోంగియా ఖాతాలో ఒక్క సెంచరీ ఉంది. ఇక సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక రన్స్ చేసిన ఇండియా తొలి వికెట్ కీపర్గా పంత్ (1746) నిలిచాడు. ధోనీ (1731) రికార్డును వెనక్కి నెట్టాడు.
22 2002లో హెడింగ్లీలో (లీడ్స్)నే జరిగిన టెస్ట్ మ్యాచ్లో సచిన్, సౌరవ్, ద్రవిడ్ సెంచరీలు బాదారు. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే వేదికపై గిల్, జైస్వాల్, పంత్ దాన్ని రిపీట్ చేశారు.
58వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇండియన్ బ్యాటర్గా పంత్ రికార్డులకెక్కాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (56)ను అధిగమించాడు. ఓవరాల్గా బెన్ స్టోక్స్ (83) ముందున్నాడు.