రక్షణ రంగంలో తయారీ పరిశ్రమల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీలో నాలుగో భాగాన్ని శనివారం మీడియాకు వివరించారామె. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. భారత్ లో ఉత్పత్తి రంగంలో స్ట్రక్చరల్ రిఫామ్స్ ద్వారా విదేశాలకు సైతం ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేలా సామర్థ్యం సాధిస్తామన్నారు. కోల్, మినరల్స్, మైనింగ్. డిఫెన్స్ ప్రొడక్షన్, ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్, పవర్ ప్రొడక్షన్, స్పేస్ సెక్టార్, అటామిక్ ఎనర్జీ వంటి ఎనిమిది రంగాల్లో సంస్కరణలపై ఈ రోజు ప్రకటించనున్నట్లు చెప్పారు.
డిఫెన్స్ తయారీ రంగంలో మేకిన్ ఇండియా విధానానికి పెద్దపీట వేయడం ద్వారా స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు నిర్మలా సీతారామన్. విదేశాల నుంచి డిఫెన్స్ దిగుమతులను తగ్గిస్తామన్నారు. ఏటా కొన్ని ఆయుధాలు, స్పేర్ పార్ట్స్ దిగుమతి బ్యాన్ కు సంబంధించిన జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. దేశంలోనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో కార్పొరేటైజేషన్ తీసుకుని వచ్చి.. వాటి సామర్థ్యం, క్వాలిటీ పెంచనున్నట్లు చెప్పారు. అయితే దేశంలో డిఫెన్స్ తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్.