ENG vs IND: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 465 ఆలౌట్.. సరికొత్త చరిత్ర సృష్టించిన బుమ్రా

ENG vs IND: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 465 ఆలౌట్.. సరికొత్త చరిత్ర సృష్టించిన బుమ్రా

ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియాకు కేవలం 6 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే దక్కడం గమనార్హం. ఫ్లాట్ పిచ్ కావడం వల్లే ఈ స్థాయిలో పరుగుల వరద పారిందని, పిచ్ నేషనల్ హైవేను తలపిస్తోందని ఈ మ్యాచ్ వీక్షించిన నెటిజన్లు సెటైర్లు పేల్చారు. ఇంతటి ఫ్లాట్ పిచ్లో కూడా బుమ్రా 5 వికెట్లతో రాణించడం మాములు విషయం కాదు. ఇంత గొప్పగా బౌలింగ్ చేసిన బుమ్రాను తోటి క్రికెటర్లు అభినందించారు.

బౌలర్లకు వికెట్ తీసే అవకాశం పెద్దగా ఎక్కడా దొరకకపోయినా బుమ్రా 5 వికెట్లు తీశాడంటే మనోడు ముందుముందు వరల్డ్ క్రికెట్లో ఎంత గొప్ప బౌలర్గా పేరు సంపాదించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో బుమ్రా మరో సరికొత్త చరిత్ర లిఖించాడు. సేనా SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో 150 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన ఆసియా బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే టీమిండియాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ మాత్రం స్వల్ప ఆధిక్యమైనా దక్కిందంటే అది కచ్చితంగా బుమ్రా వల్లే అని చెప్పక తప్పదు. ప్రసీద్ కృష్ణ కూడా 3 వికెట్లతో రాణించాడు. అయితే.. 128 పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్ రెండు వికెట్లు తీసినా 122 పరుగులు చెల్లించుకున్నాడు. బుమ్రా 24.4 ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి 83 పరుగులు మాత్రమే ఇచ్చి 3.40 ఎకానమీతో శభాష్ అనిపించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఒలీ పోప్‌‌ (106 పరుగులు) సూపర్‌‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క అడుగు దూరంలో మిగిలిపోయాడు. డకెట్ 62 పరుగులు, జాజీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38, కార్స్ 22, బెన్ స్టోక్స్ 20, రూట్ 28 పరుగులు చేశారు.

ఇక టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే.. టీమిండియా కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (227 బాల్స్‌‌లో 19 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 147)కు తోడు, రిషబ్‌‌ పంత్‌‌ (178 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 134) కూడా సెంచరీతో  దుమ్మురేపడంతో.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 113 ఓవర్లలో 471 పరుగులు సాధించి ఆలౌటైంది.

359/3 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన గిల్‌‌, పంత్‌‌ను స్టార్టింగ్‌‌లో ఇంగ్లండ్ బౌలర్లు పెద్దగా ఇబ్బందిపెట్టలేదు. సెషన్‌‌ తొలి గంట మొత్తం ఈ ఇద్దరి ఆధిపత్యమే నడిచింది. దాదాపు 16 ఓవర్లు ఈ ఇద్దరు హోమ్‌‌ టీమ్‌‌ బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కొన్నారు. షోయబ్‌‌ బషీర్‌‌ (1/100) వేసిన ఇన్నింగ్స్‌‌ వందో ఓవర్‌‌లో భారీ సిక్స్‌‌తో పంత్‌‌ 146 బాల్స్‌‌లో ఏడో సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే తన సిగ్నేచర్‌‌ ‘సోమర్‌‌సాల్ట్‌‌’తో ఫ్యాన్స్‌‌కు అభివాదం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఓవర్‌‌నైట్‌‌ స్కోరుకు 95 రన్స్‌‌ జత చేశారు. అయితే క్రీజులో పాతుకుపోయిన ఈ జంటను 102వ ఓవర్‌‌లో బషీరే విడదీశాడు. 

అతను వేసిన ఫ్లైట్‌‌ టర్నింగ్‌‌ బాల్‌‌కు భారీ షాట్‌‌ కొట్టే ప్రయత్నంలో గిల్‌‌ డీప్‌‌ బ్యాక్‌‌వర్డ్‌‌లో టంగ్‌‌ చేతికి చిక్కాడు. ఫలితంగా నాలుగో వికెట్‌‌కు 209 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇక్కడి నుంచి ఇంగ్లిష్‌‌ బౌలర్లు పట్టు బిగించారు. ఓ ఎండ్‌‌లో పంత్‌‌ను ఆడిస్తూనే.. రెండో ఎండ్‌‌లో లోయర్‌‌ ఆర్డర్‌‌ను దెబ్బతీశారు. ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన వెటరన్‌‌ కరుణ్‌‌ నాయర్‌‌ (0) ఘోరంగా నిరాశపర్చాడు. నాలుగు ఓవర్ల తర్వాత స్టోక్స్‌‌ బౌలింగ్‌‌లో ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో పోప్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి డకౌటయ్యాడు.

మరో మూడు ఓవర్ల తర్వాత అద్బుతమైన ఇన్‌‌ కమింగ్‌‌ డెలివరీతో టంగ్‌‌.. పంత్‌‌ను బోల్తా కొట్టించాడు. ఫలితంగా ఇండియా 457/7తో లంచ్‌‌కు వెళ్లింది. లంచ్‌‌ తర్వాత ఒక్కరు కూడా నిలబడలేదు. ఐదు ఓవర్లలోనే ఇన్నింగ్స్‌‌ ముగిసింది. రవీంద్ర జడేజా (11), శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (1), బుమ్రా (0), ప్రసిధ్‌‌ కృష్ణ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌‌ చేరారు. ఓవరాల్‌‌గా ఇండియా 112 రన్స్‌‌కు చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.