అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 5న కొలంబోలో ఇండో–పాక్ ఫైట్‌‌‌‌ .. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 5న కొలంబోలో ఇండో–పాక్ ఫైట్‌‌‌‌ .. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

దుబాయ్‌‌‌‌:  విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌‌‌‌లో ఇండియా–పాకిస్తాన్‌‌‌‌ హై ఓల్టేజ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5న ఈ మెగా మ్యాచ్‌‌‌‌ జరగనుంది. ఈ మేరకు  మెగా టోర్నీ షెడ్యూల్‌‌‌‌ను ఐసీసీ  సోమవారం విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్‌‌‌‌కు ఇండియా ఆతిథ్యం ఇస్తుండగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఇండో–పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను తటస్థ వేదిక అయిన కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇండియా టీమ్ జట్టు పాకిస్తాన్‌‌‌‌ వెళ్లడానికి నిరాకరించడంతో  మెన్స్ చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ కోసం అంగీకరించిన హైబ్రిడ్ మోడల్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వరల్డ్ కప్‌‌‌‌లో  పాకిస్తాన్‌‌‌‌ అమ్మాయిల జట్టు తమ మ్యాచ్‌‌‌‌లన్నింటినీ కొలంబోలోనే ఆడనుంది.

బెంగళూరులోనే తొలి మ్యాచ్

ఇండియా అమ్మాయిలు సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్‌‌‌‌తో తమ వరల్డ్ కప్‌‌‌‌  వేట ప్రారంభిస్తారు.  టోర్నీ  ఆరంభ మ్యాచ్ కూడా ఇదే. ఇటీవల ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌‌‌‌ల ఆతిథ్య హక్కులను కోల్పోవచ్చనే ఊహాగానాలకు ఐసీసీ తెరదించింది. అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌కు కూడా బెంగళూరే ఆతిథ్యం ఇవ్వనుంది.

  తొలిసారి వరల్డ్ కప్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను అందుకోవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్న ఇండియా అక్టోబర్ 9న సౌతాఫ్రికాతో,  అదేనెల 12న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో విశాఖపట్నంలో తలపడనుంది. ఆ తర్వాత ఇండోర్‌‌‌‌లో అక్టోబర్ 19న ఇంగ్లండ్‌‌‌‌తో, గువాహతిలో అక్టోబర్ 23న న్యూజిలాండ్‌‌‌‌తో ఆడనుంది. ‘విమెన్స్ క్రికెట్‌‌‌‌లోని ఎనిమిది అత్యుత్తమ జట్లు ఇండియా‌‌‌‌కు రాబోతున్నాయి. అద్భుతమైన వేదికల్లో రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నాం. మనమంతా ఒక  గొప్ప టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్నాం’  అని ఐసీసీ చైర్మన్ జై షా ఒక ప్రకటనలో తెలిపారు.

పాక్‌‌‌‌ ఆటను బట్టే సెమీస్, ఫైనల్ వేదికలు

ఈ టోర్నమెంట్‌‌‌‌లో పాకిస్తాన్ ప్రయాణాన్ని బట్టి సెమీఫైనల్, ఫైనల్ వేదికలు ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ గువాహతి లేదా కొలంబోలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. పాక్‌‌‌‌ సెమీస్‌‌‌‌కు క్వాలిఫై అయితే మ్యాచ్‌‌‌‌ కొలంబోలో నిర్వహిస్తారు.  అక్టోబర్ 30న  రెండో సెమీఫైనల్ బెంగళూరులో షెడ్యూల్‌‌‌‌ చేశారు. పాక్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ నవంబర్ 2న కొలంబోలో నిర్వహిస్తారు. లేదంటే బెంగళూరు టైటిల్ ఫైట్‌‌‌‌కు ఆతిథ్యం ఇస్తుంది. 

2013 తర్వాత ఇండియా ఈ టోర్నమెంట్‌‌‌‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. రౌండ్-రాబిన్ ఫార్మాట్‌‌‌‌లో ఎనిమిది జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. టాప్-4 జట్లు సెమీఫైనల్‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. ఇండియా, ఆసీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక  వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు నేరుగా అర్హత సాధించగా, పాకిస్తాన్, బంగ్లాదేశ్  క్వాలిఫయర్స్ ద్వారా బెర్తులు దక్కించుకున్నాయి.