
- ఇండియా మోడర్న్ లీడర్గా ఎదుగుతుంది
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో మన దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. ‘‘మనం భూమి నుంచి మరెంతో దూరం వెళ్తాం. రానున్న రోజుల్లో ఇండియా మోడర్న్ లీడర్గా ఎదుగుతుంది. స్పేస్ మిషన్లలో విజయం సాధిస్తుంది. ఆ నమ్మకం నాకుంది” అని తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిన రాకేశ్ శర్మ.. శుభాంశు శుక్లా స్పేస్లోకి వెళ్లిన సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. ఆ పాడ్కాస్ట్ను డిఫెన్స్ మినిస్ట్రీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘నేను ఇండియన్ ఎయిర్ఫోర్స్లో టెస్ట్ పైలెట్గా ఉన్నప్పుడు అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యాను.
ఆ తర్వాత మాకు రష్యాలో 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. 1984లో ఇండో–సోవియట్ స్పేస్ ఫ్లైట్లో అంతరిక్షానికి వెళ్లాను. అక్కడ 8 రోజులు ఉండి, పలు పరిశోధనలు చేశాను” అని వివరించారు. స్పేస్ నుంచి ఇండియా ఎలా కనిపించిందన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ‘‘అంతరిక్షం నుంచి చూస్తే మన దేశం అద్భుతంగా ఉంటుంది. కొండలు, గుట్టలు, పర్వతాలు, సముద్రాలు, మైదానాలు.. ఇలా అన్నీ మన దేశంలో ఉన్నాయి. స్పేస్లో కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే పగలు, రాత్రి ఉంటాయి.
ఒక్కసారి అంతరిక్ష యాత్ర చేస్తే, మనం ప్రపంచాన్ని చూసే దృక్పథమే మారిపోతుంది. ఈ గ్రహం అందరిదీ.. ఏ ఒక్కరికీ సొంతం కాదనే తత్వం బోధపడుతుంది” అని పేర్కొన్నారు. ‘‘స్పేస్ మిషన్ తర్వాత మళ్లీ ఐఏఎఫ్కు వెళ్లాను. అక్కడ కొన్నేండ్లు పని చేసిన తర్వాత చీఫ్ టెస్ట్ పైలెట్గా హెచ్ఏఎల్లో చేరాను. తేజస్ యుద్ధ విమానాల ప్రాజెక్టులో పాలుపంచుకున్నాను” అని వివరించారు.