SA vs IND,1st ODI: బోణీ అదిరింది: తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ భారీ విజయం

SA vs IND,1st ODI: బోణీ అదిరింది: తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ భారీ విజయం

స్టార్ ప్లేయర్లు లేకుండా దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు అంచనాలకు మించి రాణిస్తుంది. టీ20 సిరీస్ లో మొదట తడబడి ఈ టూర్ ను ప్రారంభించిన మన క్రికెట్ జట్టు.. క్రమంగా పుంజుకుంటోంది. చివరి టీ20 నెగ్గి సిరీస్ సమం చేసిన మన యంగ్ ఇండియా.. వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. జోహనెస్ బర్గ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిధ్య సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసి మూడు వన్డేల సిరీస్ లో శుభారంభం చేసింది.   

117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా చేధించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులకే ఔటైనా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ తో శ్రేయాస్ అయ్యర్ టీమిండియాకు విజయాన్ని అందించారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ సౌతాఫ్రికా బౌలర్ల మీద ఆధిపత్యం చూపించారు. ఈ క్రమంలో అయ్యర్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయ్యర్ 52 పరుగులు చేసి ఔట్ కాగా.. సుదర్శన్ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మల్డర్ కు ఒక వికెట్ దక్కింది. 

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. భారత పేసర్లు అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ ధాటికి కేవలం 116 పరుగులకే ఆలౌటైంది. ఫహుల్క్ వాయో 33 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ జార్జ్ 28, షంసి 11, మార్కరం 12 పరుగులు చేశారు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ కు 5 వికెట్లు, అవేశ్ ఖాన్ 4 వికెట్లు తీసుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 19న జరుగుతుంది.