
- ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తులో కీలక ముందడుగు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. దీనిపై విచారణ చేపట్టిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ).. బ్లాక్ బాక్స్లలోని డేటాను డౌన్లోడ్ చేసింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఆ డేటాను విశ్లేషిస్తున్నది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఎయిరిండియా ప్లేన్ క్రాష్ ఘటన దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. విచారణ వివరాలను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది. ‘‘అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు చేస్తున్నది.
ఘటన జరిగిన తెల్లారే ఏఏఐబీ చీఫ్ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశాం. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానంలో రెండు బ్లాక్ బాక్స్లు ఉన్నాయి. ఆ రెండింటినీ ఘటనా స్థలంలో ఇన్వెస్టిగేషన్ టీమ్ స్వాధీనం చేసుకుంది. వాటిని ఈ నెల 24న ఢిల్లీలోని ఏఏఐబీ ల్యాబ్కు తరలించాం. ఫ్రంట్ బ్లాక్ బాక్స్లోని క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్, మెమరీ మాడ్యూల్ను 25న బయటకు తీశాం. వాటిల్లోని డేటాను డౌన్లోడ్ చేశాం. ప్రస్తుతం కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ లలోని డేటాను అనాలసిస్ చేస్తున్నాం” అని కేంద్రం తెలిపింది.