- కనీసం కాంస్య పతకం ఖాయం
- ఆసియా టీమ్ చాంపియన్షిప్
మనీలా: తొలి రెండు సింగిల్స్లో నిరాశపర్చినా.. తర్వాతి మూడు మ్యాచ్ల్లో సూపర్ షో చూపెట్టిన ఇండియా… ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో సెమీస్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఇండియా 3–2తో థాయ్లాండ్పై గెలిచింది. దీంతో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 2016 లో బ్రాంజ్తో సరిపెట్టుకున్న టీమిండియా.. ఈసారి పతకం రంగు మారుస్తుందో లేదో చూడాలి. తొలి సింగిల్స్ ఆడిన వరల్డ్ చాంపియన్షిప్ బ్రాంజ్మెడలిస్ట్ బి. సాయి ప్రణీత్ 14–21, 21–14, 12–21తో వరల్డ్ 12వ ర్యాంకర్ కెంటాపోన్ వాంగ్చెరోన్ చేతిలో ఓడాడు. రెండో సింగిల్స్లోనూ వరల్డ్ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ 20–22, 14–21తో త్రీటైమ్ వరల్డ్ జూనియర్ చాంపియన్ కున్లావట్ విదిసర్న్ చేతిలో ఓడటంతో ఇండియా 0–2తో వెనుకబడింది. అయితే ఫస్ట్ డబుల్స్లో ఎం.ఆర్. అర్జున్–ధ్రువ్ కపిల 21–18, 22–20తో కిటినుపోంగ్ కెడ్రాన్–తనుపట్ విరియాంగుకురాపై గెలిచి ఆధిక్యాన్ని 1–2కు తగ్గించారు. మూడో సింగిల్స్ మ్యాచ్లో లక్ష్యసేన్ 21–19, 21–18తో వరల్డ్ నంబర్ 45వ ర్యాంకర్ సుపాను అవింగ్సెనాన్పై గెలవడంతో ఇరుజట్ల స్కోరు 2–2తో సమమైంది. ఇక డిసైడింగ్ డబుల్స్ మ్యాచ్లో చిరాగ్ షెట్టితో కలిసి బరిలోకి దిగిన శ్రీకాంత్ 21–15, 16–21, 21–15తో మీన్పోంగ్ జోంగ్జిత్–నిప్టిపోన్ పుంగాపెట్పై గెలిచి ఇండియాకు విజయాన్ని అందించారు. శనివారం జరిగే సెమీస్లో ఇండియా.. ఇండోనేసియాతో తలపడుతుంది.