ద్వైపాక్షిక సిరీస్​లో చిల్లర గొడవ.. అంపైర్ ఔట్ ఇచ్చాడని ​ ప్రత్యర్థి జట్టు వాకౌట్

ద్వైపాక్షిక సిరీస్​లో చిల్లర గొడవ.. అంపైర్ ఔట్ ఇచ్చాడని ​ ప్రత్యర్థి జట్టు వాకౌట్

ఇప్పటివరకూ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితేనో లేదంటే వెలుతురు తక్కువగా ఉందనో మ్యాచ్ ఆపేయడం చూసుంటారు. అంతకూ కాదంటే ప్రకృతి కన్నెర్ర జేస్తే మ్యాచ్ ఆపేయడం చూసుంటారు. ఈ ఘటన అలాంటి వాటికి విభిన్నం. అంపైర్ ఔట్ ఇచ్చారని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఆడటానికి నిరాకరించారు. దీంతో అంపైర్లు  మరో జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టకుండానే  డక్​వర్త్ లూయిస్​ పద్ధతిలో విజేతగా ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు గల్లీ క్రికెట్‌లో కనిపిస్తుంటాయి. అలాంటిది ద్వైపాక్షిక సిరీస్​లో చోటుచేసుకోవడం గమనార్హం.

ఏం జరిగిందంటే..?

ఇండోనేసియా, కంబోడియా జట్ల మధ్య 7 మ్యాచ్​ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్​లో నవంబర్ 22 వరకు ఐదు మ్యాచ్‌లు జరగగా.. మూడింటిలో ఇండోనేసియా.. మరో రెండింటిలో కంబోడియా విజయం సాధించచాయి. అనంతరం గురువారం(నవంబర్ 23)న ఈ ఇరు జట్ల మధ్య ఆరో టీ20​ జరిగింది. తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కంబోడియా 11.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 

ఈ క్రమంలో ఇండోనేసియా బౌలర్ ధనేశ్​ కుమార్​ శెట్టి వేసిన​ 12 ఓవర్​ మూడో బంతికి కంబోడియా బ్యాటర్ లక్మన్ బట్ (20) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇండోనేషియా ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. అంపైర్​ వెంటనే ఔట్​గా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయాన్ని కంబోడియా ప్లేయర్లు ఒప్పుకోలేదు. బ్యాట్ తాకలేదని బ్యాటర్ మొండికేయగా.. ఆ ఔట్ కాస్తా వివాదాస్పదమైంది. అంపైర్లు వారిని ఎంత బుజ్జగించినా వెనక్కు తగ్గలేదు. ఔట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటేనే ఆడతామని మొండికేశారు. దీంతో అంపైర్లు డక్​వర్త్ లూయిస్​ పద్ధతిలో ఇండోనేసియా జట్టును విజేతగా ప్రకటించారు.

ఈ కారణంగా సిరీస్‌లో మిగిలివున్న మరో మ్యాచ్​లో కూడా రద్దైంది. దీంతో ఇండోనేసియా జట్టు 4-2 తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఘటనపై అధికారికంగా ఏ జట్టూ స్పందించలేదు. ఈ ఘటనను చూసి క్రికెట్ ప్రేమికులు వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.