ఓల్డేజ్ హోంలో అమానుషం..నోయిడాలో వృద్ధులను చేతులు కట్టి.. రూమ్స్ లో లాక్ చేశారు!

ఓల్డేజ్ హోంలో అమానుషం..నోయిడాలో వృద్ధులను చేతులు కట్టి.. రూమ్స్ లో లాక్ చేశారు!
  • కొందరికి బట్టల్లేవ్.. మరికొందరి బట్టలపై మలమూత్రాల మరకలు 
  • నెలనెలా పైసలు తీస్కుంటున్నా వృద్ధులను పట్టించుకోని నిర్వాహకులు 
  • ఓల్డేజ్ హోంపై కేసు నమోదు.. 39 మంది వృద్ధుల తరలింపు

న్యూఢిల్లీ: వృద్ధాప్యంలో తమ పనులు తాము చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారిపై మానవత్వంతో వ్యవహరించాల్సిన ఓ ప్రైవేట్ ఓల్డేజ్ హోం నిర్వాహకులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. నెలనెలా పైసలు తీసుకుంటూనే వృద్ధుల ఆలనాపాలనను గాలికొదిలేశారు. అతిదారుణంగా వృద్ధుల చేతులను కట్టేసి, వారిని బేస్ మెంట్ల వంటి రూంలలో ఉంచి లాక్ చేశారు. కొందరికి బట్టలు కూడా ఇవ్వలేదు.. మరికొందరు మలమూత్రాల మరకలు అంటిన బట్టలతోనే ఉన్నా పట్టించుకోలేదు. 

యూపీలోని నోయిడా సెక్టార్ 55లోని ఆనంద్ నికేతన్ వృద్ధుల ఆశ్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది. చివరకు ఈ వృద్ధుల దీనస్థితికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో రాష్ట్ర మహిళా కమిషన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ అధికారులు గురువారం పోలీసులతో కలిసి ఆ ఓల్డేజ్ హోంపై రెయిడ్స్ చేశారు.
 మొత్తం 39 మంది వృద్ధులను రెస్క్యూ చేశారు. 

వృద్ధుల ఆలనాపాలనా చూసుకునేందుకు వారి కుటుంబసభ్యుల నుంచి రూ. 2.5 లక్షల చొప్పున డొనేషన్లు, నెలనెలా రూ. 6 వేల చొప్పున ఫీజు వసూలు చేసినా.. వారికి సపర్యలు చేయకపోగా ఇంత దారుణంగా ప్రవర్తించడంపై మహిళా కమిషన్ సభ్యురాలు మీనాక్షి భరాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఓల్డేజ్ హోంలో అంతమంది వృద్ధులు ఉన్నా.. వారిని చూసుకునేందుకు సిబ్బందిని మాత్రం నియమించలేదని ఆమె తెలిపారు. కేవలం 12వ క్లాస్ పాస్ అయిన ఓ మహిళను నర్సు పేరుతో అక్కడ ఉంచారని వెల్లడించారు. వృద్ధుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఓల్డేజ్ హోం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.