న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఐపీఎల్ పదమూడో సీజన్ జరగనుందని టోర్నీ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తే మెగా టోర్నీ క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగించడం ఖాయం. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఎలా ఉండనుందనే దానిపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పలు విషయాలు చెప్పాడు. మహమ్మారితో సీరియస్గా ఉన్న వాతావరణాన్ని ఐపీఎల్ మారుస్తుందని, మూడ్ ఆఫ్ ద నేషన్ను టోర్నీ చేంజ్ చేస్తుందన్నాడు.
‘ఐపీఎల్ ఎక్కడ జరుగుతుందనేది పెద్ద విషయం కాదు. టోర్నీ యూఏఈలో జరిగితే మంచిదే. క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్కు అది మంచి వేదికే. ఈ టోర్నీ మూడ్ ఆఫ్ ద నేషన్ను చేంజ్ చేస్తుంది. ఏ ఫ్రాంచైజీ గెలుస్తుంది, ఏ ప్లేయర్ బాగా రన్స్ చేస్తారు, ఎవరు వికెట్లు తీస్తారనేది ముఖ్యం కాదు. దేశ మూడ్ను మార్చడమే పెద్ద విషయం. ఈ నేపథ్యంలో మిగిలిన ఐపీఎల్స్తో పోల్చుకుంటే ఈ ఐపీఎల్ చాలా పెద్దది కానుంది. నా ఆలోచన ప్రకారం ఈసారి ఐపీఎల్ జరిగేది దేశం కోసమే’ అని గంభీర్ చెప్పాడు.